క్రమంగా ఉగ్రవాదంపై భారత ధీటైన స్పందన: ఆపరేషన్ సింధూర్ విజయవంతం
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకుల రక్తపాతం జరిపిన ఉగ్రవాదులకు భారత సైన్యం ఊహించని ధీటైన ప్రతీకార దాడులు జరిపింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర మూకలు రక్తపాతాన్ని సృష్టించినప్పటి నుంచి దేశమంతా బాధ, కోపావేశాల్లో మునిగిపోయింది. అలాంటి సమయంలో మే 7, బుధవారం రోజు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’తో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లలోని కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపి, ఉగ్రవాద లోకంలో తీవ్ర వణుకు పుట్టించింది.
పహల్గాం మారణహోమం తర్వాత భారత స్పందన ఎంతో కీలకమైంది. అమాయకులు హత్యకు గురైన ఆ ఘోర దృశ్యాలు ఇంకా ప్రజల మనసులో మిగిలి ఉండగానే భారత సాయుధ బలగాలు ఉగ్రవాదం మూలాలను నాశనం చేసేందుకు ముందుకు వచ్చాయి. దేశ భద్రతను ఎప్పటికప్పుడు కాపాడాలన్న తపనతో భారత సైన్యం చేసిన ఈ నిర్ణయం దేశ ప్రజల గర్వకారణంగా మారింది. “న్యాయం జరిగింది. జై హింద్!” అనే సందేశాన్ని భారత సైన్యం అధికారికంగా విడుదల చేయడం గర్వానికి కారణమైంది.
అంతర్జాతీయ స్పందనలు: ట్రంప్, జాన్సన్ వ్యాఖ్యలు చర్చనీయాంశం
ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, దానిని ‘సిగ్గుచేటు’గా అభివర్ణించారు. భారత్ ప్రతీకార చర్య తీసుకోవడం అనివార్యమైందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యల పద్ధతి అమెరికా ప్రభుత్వ వైఖరిని సూచించకపోయినా, ఉదయాన్నే ఓవల్ ఆఫీస్కు వెళ్లే సమయంలో ఆయన ఈ వార్త విన్నట్లు చెప్పారు. పాక్-భారత్ ఘర్షణ వాతావరణాన్ని తాను గతంలోనూ గమనించినట్టు ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి ముందు అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి తమ దేశం పూర్తిగా అండగా నిలుస్తుందని స్పష్టంగా ప్రకటించారు. న్యూఢిల్లీకి అవసరమైన వనరులు, సహకారం అందించేందుకు వాషింగ్టన్ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ ప్రకటన భారత్కు ఉన్న అంతర్జాతీయ మద్దతును స్పష్టంగా సూచించింది.

భారత్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన
ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారత ప్రభుత్వం తరఫున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో, పీఓకేలోని తొమ్మిది నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిగాయని పేర్కొంది. “ఈ చర్యలు పాకిస్థాన్ సైనిక స్థావరాలపై కాకుండా కేవలం ఉగ్ర మౌలిక సదుపాయాలపై మాత్రమే జరిగాయి. భారత్, పరిపక్వతతో కూడిన వ్యవహార శైలిని చూపింది” అని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరగకుండా చూసేలా బాధ్యతాయుత వైఖరిని భారత సైన్యం ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది.
Read also: India Pakistan War: ఇండియాకు మద్ధతు తెలిపిన ఇజ్రాయెల్