Aurangzebs Tomb : మహారాష్ట్రలోని శాంభాజీ నగర్ జిల్లాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమాధిని తొలగించాలని ఇటీవల ఆ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. నాగపూర్లో భీకర స్థాయిలో విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దిన్.. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్కు లేఖ రాశారు. వక్ఫ్ ఆస్తులకు కేర్టేకర్గా ఉన్న ముతావలి ప్రిన్స్ యాకూబ్ తన లేఖలో .. ఔరంగబేబు సమాధికి రక్షణ కల్పించాలని కోరారు.

సమాధి వద్ద భారీ స్థాయిలో సెక్యూర్టీ సిబ్బంది
వాస్తవానికి ఆ సమాధిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించారని, ప్రస్తుతం పురావాస్తు శాఖ ఆధీనంలో ఆ సమాధి ఉన్నట్లు చెప్పారు. అయితే 1958 నాటి ప్రాచీన కట్టడాలు, ఆర్కియాలజీ సైట్ల పరిక్షణ చట్టం ప్రకారం ఔరంగజేబు సమాధి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని డిమాండ్ చేశారు. తొవ్వడం, కూల్చడం, మార్పులు కూడా చేయరాదు అన్నారు. సమాధి వద్ద భారీ స్థాయిలో సెక్యూర్టీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని యాకూబ్ తన లేఖలో డిమాండ్ చేశారు.
ఆర్కియాలజీ శాఖకు ఆదేశాలు ఇవ్వాలి
ఔరంగజేబు సమాధికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్కియాలజీ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన లేఖలో యూఎన్ను కోరారు. సినిమాలు, మీడియా కథనాలు, సామాజిక వేదికలలో ఔరంగజేబు గురించి తప్పుగా చూపించారు. తద్వారా ప్రజల మనోభావాలను తారుమారు చేశారు. ఫలితంగా అనవసరమైన నిరసనలు, ద్వేషపూరిత ప్రచారాలు, దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి చర్యలు ఇటీవలే జరిగాయి అని లేఖలో యాకుబ్ ప్రస్తావించారు.
Read Also: రెండో రోజు ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా