అహ్మదాబాద్(Ahmedabad) లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 12న జరిగిన ఈ దుర్ఘటనలో మరణించిన ప్రయాణికులలో చివరి మృతదేహాన్ని అధికారులు శుక్రవారం రాత్రి గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 260కి చేరినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ప్రక్రియతో మృతులందరి గుర్తింపు పూర్తయినట్లయింది.
హాస్పిటల్ అధికారుల ప్రకటన
అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ జోషి (Rekhesh Joshi) ఈ వివరాలను వెల్లడించారు. “విమాన ప్రమాదంలో మరణించిన వారిలో చివరి ప్రయాణికుడి మృతదేహాన్ని డీఎన్ఏ (DNA) మ్యాచింగ్ ద్వారా గుర్తించాం. ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 260. వీరిలో 19 మంది ప్రమాదం జరిగిన ప్రాంతంలోని స్థానిక నివాసితులు” అని తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రమాద స్థలంలో కొత్తగా ఎలాంటి అవశేషాలు లభ్యం కాలేదని ఆయన స్పష్టం చేశారు. చివరిగా గుర్తించిన మృతదేహం కచ్ ప్రాంతానికి చెందిన ప్రయాణికుడిదని, దానిని శనివారం రాత్రి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
రికార్డు సమయంలో DNA గుర్తింపు ప్రక్రియ
ఈ దుర్ఘటనలో మొత్తం 318 శరీర భాగాలను వెలికితీసినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ (DNA) పరీక్షల నిమిత్తం 250 మంది బంధువులు తమ నమూనాలను అందించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధనంజయ్ ద్వివేది తెలిపారు. మొత్తం మీద 253 మందిని డీఎన్ఏ పరీక్షల ద్వారా, ఆరుగురిని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తించారు. అహ్మదాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), గాంధీనగర్లోని ఎఫ్ఎస్ఎల్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ) (NFSU) సంయుక్తంగా ఈ ప్రక్రియను చేపట్టాయి.
2 వారాల్లోనే గుర్తింపు పూర్తి
సాధారణంగా ఇలాంటి డీఎన్ఏ (DNA) మ్యాచింగ్ ప్రక్రియకు నెలల సమయం పడుతుంది. కానీ ఈ ప్రమాదం విషయంలో కేవలం రెండు వారాల్లోనే గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం. “ఎముకల నమూనాలను మెత్తటి పొడిగా, దంతాల నమూనాలను చిన్న ముక్కలుగా చేసి పొడిగా మార్చడం ద్వారా డీఎన్ఏను వెలికితీసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

32 మంది శాస్త్రవేత్తలు, పీహెచ్డీ విద్యార్థులు కలిసి..
ప్రత్యేక పరికరాలతో వేడి చేసి కణజాలం నుంచి డీఎన్ఏను వేరుచేస్తాం. అనంతరం అధునాతన సీక్వెన్సింగ్ ద్వారా పూర్తి డీఎన్ఏ ప్రొఫైల్ను రూపొందిస్తాం” అని ఎన్ఎఫ్ఎస్యూలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డీఎన్ఏ ఫోరెన్సిక్స్ హెడ్ భార్గవ్ పటేల్ వివరించారు. తమ బృందంలోని 32 మంది శాస్త్రవేత్తలు, పీహెచ్డీ విద్యార్థులు 150కి పైగా డీఎన్ఏ నమూనాలను విశ్లేషించి, 125 మందికి పైగా మృతులను విజయవంతంగా గుర్తించారని ఆయన తెలిపారు.
Read Also: Pakistan: పాకిస్థాన్లో పెను వరదల తాకిడి: ఒకే కుటుంబంలో 18 మంది