అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 టోర్నమెంట్ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేలా సాగుతోంది. తాజాగా ఈ లీగ్లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్ మరోసారి తన సత్తా చాటాడు. పొలార్డ్ టీ20 ఫార్మాట్లో ఒక విశేషమైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో పొలార్డ్ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఈ సీజన్లో కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ న్యూయార్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన వారి మొదటి మ్యాచ్లో పొలార్డ్ కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో పొలార్డ్ విరాట్ కోహ్లీ టీ20 పరుగులను అధిగమించాడు. పొలార్డ్ ఇప్పటివరకు 696 టీ20 మ్యాచ్లు ఆడి మొత్తం 13569 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 414 మ్యాచ్లలో 13543 పరుగులు చేశాడు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
క్రిస్ గేల్ – 14562 పరుగులు (463 మ్యాచ్లు),అలెక్స్ హేల్స్ – 13704 పరుగులు (497 మ్యాచ్లు),షోయబ్ మాలిక్ – 13571 పరుగులు (557 మ్యాచ్లు),కీరన్ పొలార్డ్ – 13569 పరుగులు (696 మ్యాచ్లు),విరాట్ కోహ్లీ – 13543 పరుగులు (414 మ్యాచ్లు).ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 14562 పరుగులు చేశాడు,ఇంగ్లాండ్కు చెందిన అలెక్స్ హేల్స్ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్కు చెందిన షోయబ్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు పొలార్డ్ నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు.

అవకాశం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి పెద్ద టీ20 లీగ్లో పొలార్డ్ ఆడటం గమనార్హం. ఇది ఆయనకు చాలా మ్యాచ్ లు ఆడేందుకు, పరుగులు సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. పొలార్డ్ తదుపరి మ్యాచ్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేస్తే అతను షోయబ్ మాలిక్ను కూడా అధిగమించి టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ అవుతాడు.
Read Also: BCCI: బెంగళూరు తొక్కిసలాట..బీసీసీఐ త్రిసభ్య కమిటీ ఏర్పాటు