గత నెలలో ఇరాన్ (Iran)లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారు. దుండగుల చెరలో ఉన్న ముగ్గురిని ట్రెహాన్ పోలీసులు రక్షించినట్లు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. మే29న ఇరాన్లో ముగ్గురు భారతీయులు తప్పిపోయినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ కేసును ఇరాన్లో విదేశీ వ్యవహారాల శాఖ కింద ఉన్న కాన్సులర్ విభాగం పరిశీస్తోందని భారత్లోని ఇరాన్ ఎంబసీ పేర్కొంది. సంబంధిత న్యాయ అధికారులతో చర్చలు జరపుతున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు టెహ్రాన్లోని భారత ఎంబసీతో పంచుకుంటున్నట్లు చెప్పింది. మోసపూరిత వ్యక్తులు, అక్రమ ఏజెన్సీలు చెప్పే మాటలు నమ్మి ఉద్యోగాల కోసం చట్టవ్యతిరేక మార్గాల్లో ఇతర దేశాలకు రావొద్దని ఎంబసీ సూచించింది.

కిడ్నాప్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది?
ఇటీవల ఆస్ట్రేలియాకు బయలుదేరిన తన కుమారుడు కొద్ది రోజులుగా తమకు అందుబాటులోకి రావట్లేదని, వారి సమాచారం తెలియట్లేదని పంజాబ్ ప్రభుత్వానికి ఓ యువకుడి తల్లి ఫిర్యాదు చేయడం వల్ల ఈ అంశం వెలుగులోకి వచ్చింది. డంకీ మార్గంలో ఆస్ట్రేలియా తీసుకెళతామని చెప్పి, వీరిని హోశియార్పుర్ ట్రావెల్ ఏజెంట్లు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏజెంట్ల సహాయంతో వారు దిల్లీ మీదుగా డంకీ రూట్లో ఉద్యోగాల కోసం ఆస్ట్రేలియాకు బయల్దేరారని ఆమె పేర్కొన్నారు. వారిని తీసుకువెళ్లిన ఏజెంట్లు తాత్కాలికంగా బస చేద్దామని నమ్మించి మే 11న తేదీన వారిని ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నాప్ చేశారని ఆమె తెలిపారు. విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అధికారులకు తెలియజేశారు. వారిని తాళ్లతో కట్టేసి ఉన్న ఫొటోలు తమకు పంపారని, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని, వీలైనంత త్వరగా తమ వారిని విడిపించాలని యువకుల కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలోనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన టెహ్రాన్ పోలీసుల తాజాగా వారికి కాపాడి, బయటకు తీసుకొచ్చారు.పంజాబ్ ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్ ఎంబసీ కలసికట్టుగా స్పందించిన ఫలితంగా ముగ్గురు భారతీయుల రక్షణ విజయవంతంగా జరిగింది. భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్విట్టర్/ఎక్స్ ద్వారా సమాచారం విడుదల చేసింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. కేసు ప్రస్తుతం ఇరాన్ కాన్సులర్ విభాగం పరిధిలో విచారణలో ఉంది.
Read Also: Elon Musk: ట్రంప్ బిల్లుపై మస్క్ విమర్శలు