Israel-Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. కీలక నేతలను కోల్పోయిన ఇరాన్‌

Read Time:  1 min
Israel-Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. కీలక నేతలను కోల్పోయిన ఇరాన్‌
FONT SIZE
GET APP

పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్ (Israel)‌, హమాస్‌ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. తాజాగా ఇజ్రాయెల్‌, ఇరాన్‌ (Iran) మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇరాన్‌ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్‌ మరో ఇద్దరు కీలక నేతలను(Key leaders) కోల్పోయింది.

Israel-Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. కీలక నేతలను కోల్పోయిన ఇరాన్‌
Israel-Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. కీలక నేతలను కోల్పోయిన ఇరాన్‌


సాయుధ దళాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ ఘోలంరేజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్‌ మీడియా తాజాగా వెల్లడించింది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పటికే ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నేతలు మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఫోర్డో అణు కేంద్రానికి పరిమిత నష్టం వాటిల్లినట్లు ఇరాన్‌ ధృవీకరించింది. ‘ఫోర్డో అణు కేంద్రానికి పరిమిత నష్టం జరిగింది. కొన్ని పరికరాలను, సామగ్రిని వేరే ప్రాంతానికి తరలించాము’ అని రాష్ట్ర అణుశక్తి సంస్థ ప్రతినిధి జెహ్రూజ్‌ కమల్వాండి వెల్లడించారు.
ఇరాన్‌కు ఇదే మొదటిసారి
ఇరాన్‌పై శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ (Operation Rising Lion) పేరుతో అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాక్‌తో 1980లో జరిగిన భీకర యుద్ధం తరువాత తిరిగి ఆ స్థాయిలో దాడులను ఎదుర్కోవడం ఇరాన్‌కు ఇదే మొదటిసారి. ఈ దాడుల్లో ఇరాన్‌ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్‌ మొహమ్మద్‌ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమం అధికారి జనరల్‌ అమీర్‌ అలీ హాజీజాదే, పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు మృతి చెందారు.
విమోచన దినం
ఇరాన్‌ అణు ముప్పును నిర్మూలించడం తమకు తప్పనిసరి అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అన్నారు. ఇరాన్‌ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకే ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ను ప్రారంభించామని తెలిపారు. ఇందుకు తమకు ఒక ఏడాది లేదా కొన్ని నెలలు పట్టవచ్చు అని చెప్పారు. ఇజ్రాయెల్‌ మనుగడకు ఇరాన్‌ అణు కార్యక్రమం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అందుకే ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని చెప్పారు. తన యుద్ధం ఇరాన్‌ ప్రజలతో కాదని అన్నారు. ‘గత 46 ఏండ్లుగా మిమ్ములను తొక్కి ఉంచుతున్న క్రూర నియంతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మీ విమోచన దినం దగ్గరలోనే ఉంది’ అని పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఇజ్రాయెల్‌ ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థపై దాడులు చేస్తున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో రష్యన్‌ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. అక్టోబర్‌లో క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసింది.
కఠిన శిక్ష
అమెరికాతో జరుగుతున్న అణు చర్చల నుంచి వైదొలగుతున్నామని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులు చేసిందని, దానికి కఠిన శిక్ష విధిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ తన క్రూరమైన, రక్తసిక్తమైన హస్తాన్ని ఇరాన్‌లో నేరాలకు పాల్పడేందుకు చాచిందని విమర్శించారు.

Read Also:Israel: భారత్ కు జమ్మూ కాశ్మీర్ విషయంలో క్షమాపణలు కోరిన

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.