ఇరాన్(Iran)పై ఇజ్రాయెల్(Israel) వైమానిక దాడులకు పాల్పడింది. టెహ్రాన్(Teharan)లోని శుక్రవారం పేలుడు శబ్ధాలు వినిపించాయని తొలుత ఇరాన్ వార్తా సంస్థ ధ్రువీకరించగా, ఆ తర్వాత ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Nathanyahu) వెల్లడించారు. అయితే దాడులు చేయొద్దని అమెరికా వారించినా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టి దాడులకు పాల్పడటం గమనార్హం.
మరోవైపు, ఇజ్రాయెల్ దాడులపై అమెరికా తాజాగా స్పందించింది. దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో. టెహ్రాన్ దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితి
ఇరాన్కు చెందిన అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ముందుజాగ్రత్తగా ప్రకటించింది. అయితే ఐడీఎఫ్ దళాలు ఎక్స్ వేదికగా స్పందించాయి. ఇరాన్పై తొలి దశ సైనిక చర్య ముగిసిందని పేర్కొంది. కెర్మాన్షా, లోరెస్తాన్, టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది.
ఇరాన్ అణు ఆశయాలను భగ్నం చేసే లక్ష్యంతో ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ గుండె మీద కొట్టామని అన్నారు. “ఇజ్రాయెల్ మనుగడకు ముప్పుగా మారిన ఇరాన్ను తిప్పికొట్టడానికి లక్ష్యంగా చేసుకున్న సైనిక చర్య. ముప్పును తొలగించడానికి చేప్పటిన ఆపరేషన్ ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు కొనసాగుతుంది” అని నెతన్యాహు తెలిపారు.
ఇరాన్ చర్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక దాడి
“టెహ్రాన్ నిరంకుశులు అణ్వాయుధాలను అభివృద్ధి చేసే కార్యక్రమంతో జాతి విధ్వంసక వాక్చాతుర్యాన్ని సమర్థించారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్ తొమ్మిది అణు బాంబులకు తగినంత అధిక- సంపన్న యురేనియంను ఉత్పత్తి చేసింది. ఇరాన్ ఇంతకు ముందు ఎన్నడూ తీసుకోని చర్యలు తీసుకుంది. కాబట్టి వాటిని ఆపకపోతే ఇరాన్ చాలా తక్కువ సమయంలో అణ్వాయుధాన్ని ఉత్పత్తి చేయగలదు. ఇది ఒక సంవత్సరం కావచ్చు, కొన్ని నెలల్లోపు కావచ్చు, ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోపు కావచ్చు. ఇది ఇజ్రాయెల్ మనుగడకు స్పష్టమైన ప్రమాదం” అని ఆయన పేర్కొన్నారు.ఇరాన్ చర్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక దాడిని ప్రారంభించిందని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ తెలిపారు. సమయం వచ్చింది కాబట్టి మొదలుపెట్టామని చెప్పారు. తిరిగి రాని స్థితికి చేరుకున్నామని అన్నారు. తమకు వేరే మార్గం లేదు, ఇంకా వెయిట్ చేయమని పేర్కొన్నారు. తమను నాశనం చేయాలనే ఆశయాలకు వ్యతిరేకంగా, ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నామని వెల్లడించారు.
యుద్ధానికి దారితీయకూడదన్న విశ్వదేశాల ఆశ
ఈ దాడులతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది. ఇది పరిసర ప్రాంతాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, ఇరువైపులా సంయమనం పాటించాలని కోరుతోంది. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్లోని అణు శోధన కేంద్రాలపై బాంబు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైనిక కేంద్రాలు కూడా ధ్వంసమైనట్లు స్థానిక మీడియా చెబుతోంది. ఇది ఇరాన్కు మౌలికంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Read Also: Israel: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి.. భారతీయులను హెచ్చరించిన ఎంబసీ