భారత్ – పాకిస్తాన్ సరిహద్దులతో పాటు భారత్ – బంగ్లా సరిహద్దుల్లో పహారా బాధ్యతలు నిర్వర్తించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరో 16 కొత్త బెటాలియన్లు, 2 కొత్త ఫీల్డ్ హెడ్క్వార్టర్లను నెలకొల్పనున్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలకు త్వరలో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది.
కొనసాగుతున్న అక్రమ వలసలు
వీటి ఏర్పాటు ద్వారా తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా భారత్కు వ్యతిరేకంగా మారిన పరిస్థితుల్లో ఈ రెండు దేశాల సరిహద్దుల భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే దేశంలో అక్రమంగా వలసవచ్చిన బంగ్లాదేశీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో డెమోగ్రఫీనే మార్చేసే స్థాయిలో అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారనుంది.
ఒక్కో సరిహద్దుకు ప్రత్యేక బలగం
రక్షణ శాఖ పరిధిలో ఉన్న భారత సైన్యం, వాయు సేన, నావికాదళంతో పాటు కేంద్ర హోం శాఖ పరిధిలో వివిధ సాయుధ బలగాలు ఉన్న విషయం తెలిసిందే. వాటిని పారా-మిలటరీ ఫోర్స్గా కూడా అభివర్ణిస్తారు. హోంశాఖ పరిధిలో ఉన్న సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)ను అంతర్గత భద్రత కోసం వినియోగిస్తారు. మిగతా బలగాలను సరిహద్దు పహారాతో పాటు అంతర్గత భద్రత కోసం వినియోగిస్తుంటారు. వాటిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)ను పాకిస్తాన్ సరిహద్దులతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల రక్షణ కోసం వినియోగిస్తున్నాం.
చైనా ఆక్రమిత టిబెట్ సరిహద్దుల్లో పహారా కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), నేపాల్, భూటాన్ వంటి మిత్ర దేశాల సరిహద్దుల రక్షణ కోసం సశస్త్ర సీమా బల్ (SSB), మయన్మార్ సరిహద్దుల్లో రక్షణ కోసం అస్సాం రైఫిల్స్ (AR) వంటి ప్రత్యేక బలగాలను వినియోగిస్తాం. ఇందులో ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, మిలిటెన్సీ ఎక్కువగా ఉన్నందున అస్సాం రైఫిల్స్ బలగాల్లో ఎక్కువగా భారత సైన్యం నుంచి డిప్యూటేషన్ మీద సిబ్బందిని తీసుకుంటారు. అది మినహాయిస్తే.. మిగతా అన్ని విభాగాలకు ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులే విధులు నిర్వహిస్తారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గస్తీ బాధ్యతలు
భారత దేశానికి పక్కలో బల్లెంలా మారిన దాయాది దేశం పాకిస్తాన్తో మొదటి నుంచి శత్రుత్వం కొనసాగుతోంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న ఈ శత్రుత్వంలో 1948, 1965, 1971లో యుద్ధాలు కూడా జరిగాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. భారతదేశం సరిహద్దుల్లో రెండు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. మొదటి దశలో పారామిలటరీ బలగాల్లో ఒకటైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సరిహద్దుల్లో గస్తీ బాధ్యతలు చేపట్టగా.. వాటికి వెనకాల భారత రక్షణశాఖకు చెందిన సైన్యం, ఎయిర్ఫోర్స్ వంటి బలగాలు సిద్ధంగా ఉంటాయి.
బీఎస్ఎఫ్ బలోపేతం
పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల భద్రత ప్రాధాన్యతాంశంగా మారింది. ఈ క్రమంలో రెండు సరిహద్దులను మరింత పటిష్టం చేయాలంటే ఇప్పుడున్న బీఎస్ఎఫ్ బలం సరిపోదని, మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా తూర్పు సరిహద్దుల కోసం విడిగా ఒక ఫీల్డ్ హెడ్క్వార్టర్, పశ్చిమ సరిహద్దుల కోసం విడిగా ఒక ఫీల్డ్ హెడ్క్వార్టర్ ఏర్పాటు చేస్తే మరింత సమన్వయం సాధ్యపడుతుంది. అందుకే రెండు ఫీల్డ్ హెడ్క్వార్టర్లతో పాటు 16 కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేసి BSF ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త బెటాలియన్ల ఏర్పాటు ప్రతిపాదనకు ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది.
కొత్త బెటాలియన్ల ఏర్పాట్లు
వేగంగా మారుతున్న భద్రత, భౌగోళిక సవాళ్లను పేర్కొంటూ, 20 నుంచి 21 కొత్త బెటాలియన్ల అవసరం ఉందని పేర్కొంటూ BSF కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించింది. ఇప్పుడు ప్రభుత్వం 16 బెటాలియన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం BSF 6,726 కిలోమీటర్ల పొడవైన భారత్-పాకిస్తాన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను కాపలా కాస్తోంది. వీటిలో 1,047 కిలోమీటర్ల మేర ఇప్పటికీ కంచె లేదు.
Read Also: India- Pak War : భారత్ – పాక్ ఉద్రికత్తలు మధ్య ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన