Walter Ladwig: భారత్–పాక్ సరికొత్త ఘర్షణ వాతావరణం: వాల్టర్ లాడ్విగ్ విశ్లేషణ

Read Time:  1 min
Walter Ladwig: భారత్–పాక్ సరికొత్త ఘర్షణ వాతావరణం: వాల్టర్ లాడ్విగ్ విశ్లేషణ
FONT SIZE
GET APP

ఇటీవల భారత్, పాకిస్థాన్ (India-Pak) మధ్య జరిగిన సైనిక దాడులు, ప్రతిదాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయని లండన్‌లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ వాల్టర్ లాడ్విగ్ (Walter Ladwig) అన్నారు. రెండు అణ్వస్త్ర దేశాలు ఇలా వరుసగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను శిక్షించడమే భారత్ లక్ష్యమని, పాకిస్థాన్‌తో పెద్ద యుద్ధానికి దిగడం కాదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డిటరెన్స్’ పేరిట భద్రతా వ్యవహారాల అధ్యయన సంస్థ ‘రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్’ కోసం రాసిన విశ్లేషణలో లాడ్విగ్ (Walter Ladwig) ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత వైమానిక దళం గత దశాబ్ద కాలంగా పెంపొందించుకున్న సామర్థ్యాలు స్పష్టంగా కనిపించాయన్నారు. అణుశక్తి కలిగిన రెండు దేశాలు ఈ విధంగా పరస్పరం వైమానిక దాడులు చేసుకోవడం అణుయుగంలో మనకు ఇంతకుముందు కనిపించని పరిణామం అని ఆయన తెలిపారు.
2019 బాలాకోట్ దాడులు: ఒక మలుపు
2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావిస్తూ, ఆ సంఘటన ఒక కీలక మలుపు అని, అది చాలా వ్యూహాత్మకంగా జరిగిందని అన్నారు. “1960ల చివర్లో రష్యా, చైనాలు భూభాగంపై పోరాడాయి. అప్పుడు కూడా ఉద్రిక్తతలు పెరగకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, ఇది పూర్తిగా కొత్త పరిస్థితి. రాబోయే దశాబ్దాల్లో దీనిపై విస్తృత అధ్యయనం జరుగుతుంది” అని లాడ్విగ్ (Walter Ladwig) అభిప్రాయపడ్డారు. పొరుగు దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న కచ్చితమైన చర్యలను ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ విధానాలలో ఇది ఒక పరిణామంగా నేను చూస్తున్నాను. 2016లో యూరీ ఉగ్రదాడికి ప్రతిగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ వంటి సరిహద్దు దాడులు గతంలో జరిగినా, వాటిని ఇంత బహిరంగంగా ప్రకటించలేదు. 2019 బాలాకోట్ దాడులు గత సంప్రదాయాలకు భిన్నంగా జరిగాయి. ఇప్పుడు, అనేక లక్ష్యాలపై పలు దఫాలుగా దాడులు చేయడం మరో స్థాయికి చేరింది అని వివరించారు.

Walter Ladwig: భారత్–పాక్ సరికొత్త ఘర్షణ వాతావరణం: వాల్టర్ లాడ్విగ్ విశ్లేషణ
Walter Ladwig: భారత్–పాక్ సరికొత్త ఘర్షణ వాతావరణం: వాల్టర్ లాడ్విగ్ విశ్లేషణ

ప్రతీకార దాడుల తరువాత ఉగ్రవాదుల వ్యూహ మార్పు
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సమీకరణాలను మార్చే ప్రయత్నం చేసింది. ఉగ్రవాదులకు తమ భూభాగంలో స్థావరం కల్పించకుండా చూడాల్సిన బాధ్యత అవతలి పక్షంపైనే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది, అని లాడ్విగ్ అన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కోర్టులో నిరూపించాల్సిన అవసరం భారత్‌కు లేదని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకుండా నిరోధించడంలో విఫలమైతే, తీవ్ర చర్యలు తీసుకునే హక్కు తమకు ఉంటుందని భారత్ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, బాధ్యతను అవతలి పక్షంపై నెట్టడం అంటే, అంతర్జాతీయ సమాజం ముందు విశ్వసనీయమైన వాదనను ఉంచే ప్రయత్నాలను భారత్ ఆపేస్తుందని కాదని ఆయన అన్నారు. పహల్గామ్ దాడి అనంతరం భారత్‌కు అంతర్జాతీయంగా సంఘీభావం లభించిందని, భాగస్వామ్య దేశాల నుంచి సానుభూతి, మద్దతు అందాయని, అయితే దీనిని తేలికగా తీసుకోకూడదని సూచించారు.ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులను శిక్షించడానికే కానీ, యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి కాదు. లాడ్విగ్ (Walter Ladwig) విశ్లేషణ ప్రకారం, భారత్ ప్రతీకార సామర్థ్యాన్ని చూపిస్తూ, అంతర్జాతీయంగా తన స్థిరతను నిలబెట్టుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలు భవిష్యత్తులో భారత భద్రతా విధానానికి వ్యూహాత్మక ఆవిర్భావంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.ప్రతిదాడుల పరంపర మొదలయ్యాక, కేవలం ఉగ్ర స్థావరాలపైనే కాకుండా, మరింత తీవ్రంగా దాడులు చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించాలనే కోరిక కనిపించింది. లేకపోతే, ప్రభుత్వం ఎందుకు దాడులను ఆపివేసిందనే ప్రశ్నలు తలెత్తుతాయి, అని లాడ్విగ్ పేర్కొన్నారు.
పిల్లి-ఎలుక ఆట మొదలైంది
భారత్ తన ప్రతీకార సామర్థ్యాన్ని ప్రదర్శించడం వల్ల ఉగ్రవాదులతో పిల్లి-ఎలుక ఆట మొదలవుతుందని ఆయన అన్నారు. దాడుల తర్వాత, తెలివైన ఉగ్రవాదులు ఏదైనా పెద్ద సంఘటన జరిగిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. తెలిసిన స్థావరాల్లో కూర్చొని ప్రతీకారం కోసం ఎదురుచూడరు,అని ఆయన అన్నారు. ఉగ్రవాద సంస్థలు తమ జాడలను కప్పిపుచ్చుకోవడానికి, రహస్యంగా కార్యకలాపాలు సాగించడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తాయి కాబట్టి, వారిని కనిపెట్టడం, పర్యవేక్షించడం, కచ్చితమైన సమాచారం సేకరించడం నిఘా అధికారులకు మరింత కష్టతరం అవుతుంది, అని ప్రొఫెసర్ లాడ్విగ్ (Walter Ladwig) విశ్లేషించారు.
Read Also: United Nations : సింధు జలాల ఒప్పందంపై భారత్ స్పష్టీకరణ

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.