అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించిందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడల్లా మంచుకొండల అందాలను తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తన కెమెరాల్లో బంధించేవారని వివరించారు. 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా భూమిని చేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు నాసా ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని తమ రోదసి యాత్ర అనుభవాలను పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కన్పించిందని విలేకరి అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు.
చేపల పడవలు మాకు సంకేతాలుగా పనిచేసేవి
‘భారత్ అద్భుతంగా కనిపించేది. తూర్పు నుంచి గుజరాత్, ముంబయి వంటి ప్రాంతాలవైపు వెళుతున్నప్పుడు పశ్చిమ తీరంలో నిలిపి ఉంచిన చేపల పడవలు మాకు సంకేతాలుగా పనిచేసేవి. అంటే భారత దేశానికి వచ్చామని గుర్తు చేసేవి. భారత్ను చూస్తే పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల గుండా వెళుతున్నట్లు అనిపించేది. రాత్రి సమయాల్లో అలాగే పగటిపూట కూడా భారత్ అద్భుతంగా కనిపించేది. ఇక హిమాలయాలు అయితే అత్యద్భుతం’ అని సునీతా విలిమయ్స్ వివరించారు.
త్వరలోనే ఇండియాకు వస్తా..
ఇక తన తండ్రి పుట్టిన భారత దేశానికి త్వరలోనే తిరిగివెళ్లాలని అనుకుంటున్నానని మనసులో మాటను సునీతా బయటపెట్టారు. అక్కడి బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్ష అనుభవాలను పంచుకోవాలని ఉందన్నారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమన్న సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. తనలోనూ ఆ మూలాలు ఉండటం గర్వంగా ఉందన్నారు. తనతో పాటు తన ఐఎస్ఎస్ బృందాన్ని కూడా భారత్కు తీసుకెళ్తారా అని విలేకరి ప్రశ్నించగా, కచ్చితంగా తీసుకెళ్తానని సునీతా నవ్వుతూ జవాబిచ్చారు. మంచి భారతీయ మసాలా వంటకాలను అందరికీ తీసుకొస్తానని అవి రుచిగా ఉంటాయన్నారు.
అవకాశం వస్తే మళ్లీ స్టార్ లైనర్లోకి వెళ్తా
ఇక అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తామని, అది చాలా సామర్థ్యం గల వాహకనౌక సునీతా విలియమ్స్ అన్నారు. అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీతా విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తానని తెలిపారు. అయితే, అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని, అందుకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు. తాను మళ్లీ సాధరణంగా స్థితికి రావడానికి సహాయం చేసిన శిక్షకులకు ఈ సందర్భంగా సునీతా ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని పేర్కొన్నారు.
మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుంది: విల్మోర్
మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని విల్మోర్ అన్నారు. ఇక స్టార్లైనర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.
సురక్షితంగా భూమిపైకి వచ్చారు
గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వారు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది.