పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం క్రూయిజ్ క్షిపణులతో మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్పై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తప్పుడు సమాచారం ప్రచురించడంపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘గ్లోబల్ టైమ్స్ ఈ విధమైన తప్పుడు సమాచారం ప్రచురించే ముందు మీరు వాస్తవాలను నిర్ధారించుకోవాలి,మీ మూలాలపై సవాల్ చేయాలని మేము సలహా ఇస్తున్నాం’ అని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా X (ట్విట్టర్)లో పేర్కొంది.ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 ప్రదేశాల్లో 24 ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. కానీ పాకిస్థాన్కు మిత్రుడైన చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చేసిందని తప్పుడు కథనాలను ప్రచురించిందని భారత రాయబార కార్యాలయం వివరించింది.ఆపరేషన్ సిందూర్పై పాక్ అనుకూల సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మీడియా సంస్థలు వాటి మూలాలను నిర్ధారించకుండా ఈ దుష్ప్రచారాన్ని వ్యాపింపజేయడం జర్నలిజం నైతికతకు విరుద్ధం’ అని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
ఉగ్రదాడి
భారత సమాచార శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్ వెల్లడించిన విషయాల ప్రకారం, గతంలో కూలిన యుద్ధ విమానాల దృశ్యాలను ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో కూలిపోయినవిగా ప్రచారం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.వైరల్ అవుతోన్న ఓ ఫోటో సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లో కూలిన MiG-29 యుద్ధవిమానానికి చెందింది.మరొకటి 2021లో పంజాబ్లో కూలిన MiG-21 కు సంబంధించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ వద్ద 26మంది పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయాన్ని గ్లోబల్ టైమ్స్ దృష్టికి తీసుకువచ్చిన భారత ప్రభుత్వం అది పాక్ సైన్యం మద్దతున్న లష్కరే తొయిబా కి చెందిన ఉగ్రవాదులు చేసిన నరమేధం అని పేర్కొంది.ఈ దాడిలో బాధితులను మతం ఆధారంగా గుర్తించి లక్ష్యం చేసుకుని,వారి కుటుంబాల ముందే దగ్గర నుంచి తలపై కాల్చి హత్య చేశారని,ఈ క్రూరమైన చర్యకు బలమైన సందేశం పంపించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు భారత రాయబార కార్యాలయం వివరించింది.

ప్రస్తావన
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించగా ఇది ఐక్యరాజ్యసమితి నిషేధిత పాక్-ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా కి అనుబంధంగా పనిచేస్తోందని భారత నివేదికలు స్పష్టం చేశాయి. మే, నవంబర్ 2024లో ఐరాస భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీకి టిఆర్ఎఫ్ పై వివరాలను భారత్ అందించిందని, డిసెంబర్ 2023లో కూడా ఎల్ఈటి, జైషే-మొహమ్మద్ లు టిఆర్ ఎఫ్ వంటి చిన్న సంస్థల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయని గుర్తు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 25న యూఎన్ఎస్సి మీడియా ప్రకటనలో టిఆర్ఎఫ్ ప్రస్తావన తొలగించాలన్న పాక్ చేసిన ప్రతిపాదనకు కూడా భారత్ విమర్శించింది. ‘‘దాడి జరిగి పది రోజులు గడిచినా పాకిస్థాన్ తన భూభాగంపై ఉన్న ఉగ్రవాద మౌలికసదుపాయాలపై చర్య తీసుకోకపోవడం ఆందోళనకరం’” అని రాయబార కార్యాలయం వ్యాఖ్యానించింది. ‘బదులుగా, వారు విమర్శలు, అపవాదులకే పరిమితమయ్యారు. పాక్ ఆధారిత ఉగ్ర మాడ్యూళ్ల నుంచి మరిన్ని దాడుల ప్రమాదం మేము గమనించాం’ అని పేర్కొన్నారు.
Read Also :Donald Trump: భారత్, పాక్ ఉద్రిక్తతలపై మళ్లీ స్పందించిన ట్రంప్