పాకిస్థాన్(Pakistan)కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన హర్యానా(Haryana)కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె విలాసవంతమైన జీవనశైలి, విదేశీ పర్యటనలకు నిధులు ఎలా సమకూరాయన్న కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
‘వెగో’ ట్రావెల్ కంపెనీ స్పాన్సర్గా
జ్యోతి మల్హోత్రా చేసిన కొన్ని వీడియోలకు యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ‘వెగో’ అనే ట్రావెల్ కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ‘వెగో’ సంస్థకు అంతర్జాతీయ విమాన రవాణా సంఘం గుర్తింపు ఉంది. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్లోనూ చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ‘వెగో’కు లైసెన్స్ ఉందని సమాచారం.
‘ట్రావెల్ విత్ జో’
అయితే, ఈ సంస్థ నేరుగా పాకిస్థాన్కు నిధులు సమకూర్చినట్లు ఆధారాలు లేకపోయినా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా ప్రయాణాలకు స్పాన్సర్గా నిలవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రావెల్ బ్లాగర్గా, యూట్యూబర్గా గుర్తింపు పొందిన జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తోంది. ఈ ఛానెల్ ద్వారా ఆమె ఇండోనేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో పర్యటించిన వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్కు సుమారు 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ, ఆమె అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు స్పాన్సర్లుగా ఎవరు వ్యవహరించారనే దానిపై కూపీ లాగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Read Also: Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే ఫైగ్లిన్