అహ్మదాబాద్(Ahmedabad)లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించినట్టు ఎయిర్ ఇండియా(Air India) ప్రకటించింది. విమాన శకలాల వద్ద మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు చాలా కష్టంగా మారింది. ఒక్కొక్కటిగా శకలాలను బయటకు తీస్తూ వాటి కింద మృతదేహాలు కనిపిస్తాయోమోనని సిబ్బంది, అధికారులు వెతుకుతున్నారు. పోలీసు జాగిలాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎవరిదైనా మృతదేహం కనిపిస్తే, ప్లాస్లిక్ స్ట్రెచర్పై ఆస్పత్రికి తరలిస్తున్నారు.
మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతుల్ని గుర్తించే అవకాశం ఉంది.
అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ఆందోళన
ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ఏఐ171 ప్రమాదానికి గురవ్వడంతో ఎయిర్ ఇండియాకు చెందిన మరికొన్ని సర్వీసులను ఆ సంస్థ నిలిపివేసింది. అహ్మదాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం అర్ధరాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బంది వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది, పైలట్లు సహా 242 మంది ప్రయాణిస్తున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.
ఎయిర్పోర్టు వెనకభాగంలో ప్రమాదం
ప్రమాదం జరిగిన ప్రదేశం విమానాశ్రయం వెనుక భాగంలో ఉంది. మేఘనీనగర్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొని విమానం క్రాష్ అయినట్టు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
గురువారం మధ్యాహ్నం 1.38 గంటల సమయంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మేఘనీనగర్ ప్రాంతంలో ప్రమాదం జరిగిన మార్గంలోకి ఎవరినీ రానీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ , ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, మీడియా ప్రతినిధులు మాత్రమే అక్కడ ఉన్నారు. సాధారణ పౌరులు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ప్రదేశమంతటా భారీగా నల్లని శకలాలు
ప్రమాదం జరిగిన ప్రదేశమంతటా భారీగా నల్లని శకలాలు కనిపిస్తున్నాయి.
అక్కడ ఐదంతస్తుల భవనాలు వరుసగా ఐదు ఉన్నాయి. వీటిలో మొదటి భవనం అంటే, ఎయిర్పోర్టు వైపు ఉన్న భవనాన్ని విమానం ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన సమయంలో అది ఒక్కసారిగా పేలినట్టు ప్రమాదానికి సంబంధించి వైరల్ అయిన వీడియోల ద్వారా తెలుస్తోంది. విమాన శకలాలను సేకరించే పనిలో అధికారులు కనిపించారు. ముఖ్యంగా విమానంలో కీలకమైన బ్లాక్ బాక్స్ కోసం వారు వెతుకుతున్నట్టుగా కనిపించింది. బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ”ప్రస్తుతం సహాయక చర్యలు, మృతదేహాల గుర్తింపు పనులు కొనసాగుతున్నాయి.” అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. విమానం ఢీకొట్టిన భవనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో సహాయక చర్యల కొనసాగింపులో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. భవనం పూర్తిగా దగ్ధమైనందున అది ఏ క్షణమైనా కూలే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
200 మీటర్ల వరకు మంటలు
మంటల కారణంగా అదే ప్రాంగణంలో ఉన్న మరో నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. భవనాలు మసిబారి నల్లగా కనిపిస్తున్నాయి. ప్రాంగణంలోని చెట్లు మాడిపోయాయి. దాదాపు రెండు వందల మీటర్ల దూరం వరకు మంటల తీవ్రత వ్యాపించినట్టు స్పష్టమవుతోంది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ ఉన్న ఓ వేప చెట్టు సగం కాలిపోయి.. సగం పచ్చగా ఉంది. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డుకు మరోవైపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) అనే పరిశోధనా సంస్థ ఉంది.
Read Also: Flight Crash: విమానంలో చివరి క్షణంలో ఏం జరిగింది?