India Pak Tensions: సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌- విద్యుత్ సరఫరా నిలిపివేత

Read Time:  1 min
India Pak Tensions: సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌- విద్యుత్ సరఫరా నిలిపివేత
FONT SIZE
GET APP

భారత్-పాక్‌ (India Pak) మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్‌ సరఫరా(Electricity) నిలిపివేశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాసంస్థలు మూసివేశారు. పోలీసుల, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో సహా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి.
పోలీసు సిబ్బంది సెలవులు రద్దు
పంజాబ్‌ సర్కాక్​ అక్కడి పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేసింది. సరిహద్దులోని 6 జిల్లాల పరిధిలో పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫెరోజ్‌పుర్‌, పఠాన్‌కోట్‌, ఫజిల్కా, అమృత్‌సర్‌, గుర్‌దాస్‌పుర్‌, తర్న్‌ తరన్‌ జిల్లాల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలు మూసివేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు చంఢీగడ్‌ సహా అనేక జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉద్రిక్తతల వేళ చాలా అప్రమత్తంగా ఉన్నామని పంజాబ్‌ మంత్రి ఆమన్‌ ఆరోరా (Aman Arora) వెల్లడించారు.

 India Pak Tensions :సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌- విద్యుత్ సరఫరా నిలిపివేత
India Pak Tensions :సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌- విద్యుత్ సరఫరా నిలిపివేత

హరియాణాలోనూ పోలీసు సిబ్బంది సహా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. వారు పనిచేస్తున్న ప్రాంతాల్లోనే ఉండాలని అన్ని జిల్లాల సివిల్‌ సర్జన్లకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కేంద్రాన్ని వీడి వెళ్లవద్దని స్పష్టం చేశారు. దిల్లీ సర్కార్​ కూడా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశమున్న వేళ, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ అధికారికీ సెలవులు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే సంసిద్ధత కోసం ఆయా విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం
పంజాబ్‌ సరిహద్దు కలిగిన హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. హమీర్‌పుర్‌, ఉనా, బిలాస్‌పుర్‌ సహా సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాబా బాలక్‌నాథ్‌, మాతా చింత్‌పుర్నీ, మాతా నైనా దేవీ వంటి ప్రముఖ దేవాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. రాజస్థాన్‌ గవర్నమెంట్​ కూడా పోలీసుల, ఇతర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. 5 సరిహద్దు జిల్లాల్లోని స్కూళ్లను మూసివేసింది. పశ్చిమ రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాల్లో విద్యుత్​ సరఫరా నిలిపివేసింది. బార్మర్‌, జైసల్మేర్‌, జోధ్‌పుర్‌ సహా పలు జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం వరకు బ్లాక్‌అవుట్‌ అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లలో లైట్లను ఆపేయాలని పోలీసులు సూచించారు.

ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలు నిలిపివేత

మే 10వ తేదీ వరకు బికనెర్‌, అజ్మీర్‌లోని కిషన్‌గఢ్‌, జోధ్‌పుర్‌ ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్‌ తీర ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేయడంతోపాటు, సెలవుల్లో ఉన్నవారిని తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. గుజరాత్‌కు భూ, సముద్ర సరిహద్దు ఉంది. రాజ్‌కోట్‌ రేంజ్‌, జామ్‌నగర్‌, మోర్బీ, దేవ్‌భూమి, ద్వారక జిల్లాలకు తీర ప్రాంతం ఉంది. గ్రామాల్లో పోలీసు గస్తీ పెంచిన అధికారులు, ఏమైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే తెలియజేయాలని గ్రామ ప్రజలు, సర్పంచ్‌లకు సూచించారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారు వెంటనే తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించింది. బిహార్‌ ప్రభుత్వం కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంది.

Read Also: Ajit Doval: పాకిస్థాన్ లో దీపావళి అన్న అజిత్ దోవ‌ల్ వీడియో వైర‌ల్‌

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.