ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్(Hamas) అగ్రనేత మహ్మద్ సిన్వర్(Hamas Leader Sinwar) హతమయ్యాడు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ధ్రువీకరించారు. ఇటీవల ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో సిన్వర్ మృతిచెందినట్లు పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ వెల్లడించారు. తాజా పరిణామాలపై మాట్లాడిన నెతన్యాహు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన హమాస్ నేతల జాబితాను ప్రకటించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి సిన్వర్.
యుద్ధ విమానాలతో బాంబుల వర్షం
మహ్మద్ సిన్వర్ లక్ష్యంగానే ఇజ్రాయెల్ సైనిక దళాలు బుధవారం దాడులు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్లోని యూరోపియన్ ఆసుపత్రి భూగర్భ మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు జరిపాయి. యుద్ధ విమానాలతో డజన్ల కొద్దీ బాంబులను వదిలాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోగా మరో 70 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లోనే మహ్మద్ సిన్వర్ కూడా మృతి చెందినట్లు సమాచారం.
కాగా, హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ సోదరుడే ఈ మహ్మద్ సిన్వర్. హమాస్ మిలటరీ వింగ్ సారథి డెయిఫ్ మృతి తర్వాత ఆ బాధ్యతలను మహ్మద్ సిన్వర్ తీసుకున్నాడు. అనంతరం తన సోదరుడు యాహ్యా మరణానంతరం హమాస్ టాప్ కమాండర్ స్థాయికి చేరుకున్నాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మెరుపుదాడి సూత్రధారిగా ఉన్న యాహ్యా సిన్వర్ గతేడాది మృతిచెందగా తాజాగా జరిగిన దాడిలో ఇతడు కూడా హతమయ్యాడు. అంతకుముందు హమాస్ అధినేతగా ఉన్న ఇస్మాయెల్ హనియే గతేడాది జులైలో ఇరాన్లోని టెహ్రాన్ బాంబు పేలుడు ఘటనలో హతమయ్యాడు.
నిద్రలోనే చనిపోయిన 18 మంది చిన్నారులు
అంతకుముందు ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ చేసిన వేర్వేరు దాడుల్లో 54 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మృతుల్లో జబాలియాలో ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న 18 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నట్లు వెల్లడించారు. నిద్రలోనే వీరంతా చనిపోయారని స్థానికులు చెప్పారు. మొత్తం మూడు సార్లు ఈ పాఠశాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించిందని వివరించారు. జబాలియాలో చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: Student Visas: వీసాలపై అమెరికా కీలక నిర్ణయం..స్పందించిన చైనా