జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్ని ఖండిస్తుంటే మన పొరుగు దేశాలైనా చైనా, బంగ్లాదేశ్లు మాత్రం పాకిస్థాన్కు మద్దతిస్తున్నాయి. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటున్న వేళ బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు పాకిస్థాన్ నడ్డివిరిచి ఆ దేశం నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా భారత్ పైనే దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకుంటున్న చర్యలను ఉద్దేశిస్తూ బంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి, ఆ దేశ ప్రస్తుత ప్రధాని మహ్మద్ యూనస్ ముఖ్య సలహాదారు అయిన మేజర్ జనరల్ (రిటైర్డ్) ఏఎల్ఎం ఫజ్లుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ కనుక పాకిస్థాన్ను ఆక్రమిస్తే తాము చైనాతో కలిసి ఇండియా ఈశాన్య రాష్ట్రాల మీద దాడి చేస్తామని హెచ్చరించాడు.
ప్రభుత్వం
బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్న యూనస్ మధ్యంతర ప్రభుత్వం రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. దూరంగా ఉంది. రెహమాన్ తన ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం నాడు బెంగాలీలో ఇలా రాసుకొచ్చాడు. ఒకవేళ ఇండియా గనక పాక్ మీద దాడి చేస్తే అప్పుడు బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలను ఆక్రమిస్తుంది అని హెచ్చరించాడు. అంతేకాక ఈ విషయంలో సంయుక్త సైనిక ఏర్పాట్లపై చైనాతో చర్చలు ప్రారంభించడం అవసరమని తాను భావిస్తున్నాను అని పోస్ట్ చేశాడు.అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం రెహమాన్ వ్యాఖ్యల నుంచి తనను తాను దూరంగా ఉంచుకుంది. ఈ సందర్భంగా బంగ్లా విదేశాంగ మంత్రి ఒకరు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ విధానాలను ప్రతిబింబించవు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదు ప్రోత్సాహించదు అని తెలిపారు.
మధ్యంతర
అంతేకాక రెహమాన్ వ్యక్తం చేసిన వ్యక్తిగత అభిప్రాయాలతో రాష్ట్రాన్ని ముడిపెట్టవద్దని ప్రభుత్వం సంబంధిత వర్గాలందరినీ కోరింది అని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం 2024లో రెహమాన్ను నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ ఛైర్మన్గా నియమించింది. ఈ కమిషన్ 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటులో జరిగిన హత్యలను విచారించడానికి నియమించబడింది.ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనిస్ చైనా పర్యటన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా తన ప్రాబల్యం పెంచుకోవాలంటూ పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అప్పట్లో భారత్ ఘాటుగా స్పందించింది. ఉద్రిక్తతలు పెంచే వ్యాఖ్యలను మానుకోవాలని ప్రధాని మోదీ స్వయంగా బంగ్లాదేశ్కు సూచించారు. ఆ తరువాత భారతీయ పోర్టులను వినియోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్పై నిషేధం విధించింది.