గాజాలో ఈ సంవత్సరం పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం భయానక స్థాయికి చేరింది.ఈ యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 51 వేలు దాటింది. లక్షా 16 వేలకు పైగా ప్రజలు గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గత 48 గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 92 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది రెండు నెలల కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఫలితం
కాల్పుల విరమణ ఒప్పందం కోసం సగం మంది బందీలను విడుదల చేయాలని తాజాగా ఇజ్రాయెల్ హమాస్ను కొరగా అందుకు హమాస్ నిరాకరించడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు మండిపడ్డారు. గాజాలో యుద్ధం కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని, హమాస్ను అంతం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హమాస్ కోరికలను ఇప్పుడు తాము అంగీకరిస్తే సైనికుల పోరాటాలకు ఫలితం ఉండదని తెలిపారు. ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులకు విలువ ఉండదని చెప్పారు.ప్రధానమంత్రి నెతాన్యాహూపై బందీల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని విడిపించేందుకు ఆయన వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. 59 మంది బందీలను విడిపించేందుకు ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరారు. నినాదాలు, ప్రసంగాలతో నిజాన్ని దాచలేరని విమర్శించారు.

అలెగ్జాండర్
తమ అధీనంలో బందీగా ఉన్న అమెరికా ఇజ్రాయెల్ పౌరుడు ఎడాన్ అలెగ్జాండర్కు సంబంధించి హమాస్ కీలక ప్రకటన చేసింది. అలెగ్జాండర్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తమకు తెలియదని చెప్పింది. అతడికి కాపలాగా నియమించిన గార్డు చనిపోయి కనిపించాడని వివరించింది. 2023 అక్టోబర్ 7 న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. కాల్పుల విరమణ ఒప్పందాల్లో భాగంగా బందీలలో కొందరిని ఇజ్రాయెల్కు హమాస్ ఇంతకుముందు అప్పగించింది. పలువురు వివిధ దాడుల్లో మరణించారు. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్టు తెలుస్తోంది.ఖాన్యునిస్ సమీపం దాడుల్లో పాలస్తీనా పార్లమెంట్ సభ్యుడు, తన రాజకీయం విభాగం సభ్యుడు సలాహ్ బార్దవిల్, ఆయన భార్య చనిపోయినట్లు హమాస్ వర్గాలు ప్రకటించాయి. టెంట్లో ప్రార్థనలు చేస్తున్న సమయం లో వీరి పై దాడి జరిగిందని పేర్కొన్నాయి.
Read Also:Sundar Pichai: వైభవ్ సూర్యవంశీపై సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!