అట్టారీ-వాఘా సరిహద్దును దాయాది పాకిస్థాన్ తిరిగి తెరిచింది. భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం ఓపెన్ చేసింది. దీంతో బార్డర్లో చిక్కుకుపోయిన చాలా మంది పాక్ జాతీయులు ఈరోజు ఉదయం తమ దేశంలోకి అడుగుపెట్టారు. కాగా, గురువారం సరిహద్దును మూసివేయడంతో అనేక మంది పాకిస్థానీయులు భారతదేశం వైపు చిక్కుకుపోయారు. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వివిధ వీసాపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరుదేశాలూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి డెడ్లైన్ కూడా విధించాయి. ఆ గడువు ముగియడంతో పాకిస్థాన్ గురువారం ఉదయం 8 గంటలకు సరిహద్దును మూసివేసింది.
పాక్లో అడుగుపెట్టిన ఆదేశ పౌరులు
ఈ సరిహద్దు వద్ద పాకిస్థాన్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వేచి చూస్తుండగానే గేట్లను మూసివేసింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. దీంతో డజన్ల కొద్దీ పాక్ పౌరులు ఆ సరిహద్దు వద్దనే నిలిచిపోయారు. ఈరోజు ఉదయం మళ్లీ బార్డర్ గేట్లను తెరవడంతో వారు పాక్లో అడుగుపెట్టారు. ఇక బుధవారం నాడు 125 మంది పాకిస్థానీయులు అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత్ను విడిచి స్వదేశానికి వెళ్లారు. దీంతో ఆంక్షలు విధించిన ఏప్రిల్ 24 తర్వాత నుంచి ఏడు రోజులలో ఇండియాను వీడిన పాక్ పౌరుల సంఖ్య 911కి చేరింది. శుక్రవారం ఉదయం పాక్ గేట్ను తిరిగి తెరిచింది, దీంతో బార్డర్ వద్ద ఎదురు చూస్తున్న పౌరులు తమ స్వదేశంలోకి ప్రవేశించారు. ఈ చర్యతో పాక్ పౌరుల బాధలు కొంతవరకు తీరాయి.
Read Also: Israel: సిరియా అధ్యక్షుడి భవనంపైనే ఇజ్రాయెల్ మెరుపుదాడి