ఇటీవల భరత్ కు చేరుకున్న అక్రమ వలసదారులు 104 మంది భారతీయుల్ని డొనాల్డ్ ట్రంప్ స్వదేశానికి పంపేశారు. కాళ్లకు బేడీలు వేసి మరీ వీరిని తరలించినట్లు పలు వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మొదటి బ్యాచ్ లో వీరిని స్వదేశానికి ఇలా పంపేయడం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అసలు విషయం బయటికొస్తోంది. తాజాగా అమెరికాలోని టెక్సాస్ నుంచి భారత్ లోని అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సీ17 మిలటరీ విమానంలో వచ్చిన వారు ఎవరన్న దానిపై అక్కడి అధికారులు కొన్ని వివరాలు బయటపెట్టారు. వీటి ప్రకారం వీరిలో అత్యధికులు అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో పట్టుబడిన వారేనని తేలింది. అలాగే వీరు మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారుగా తేల్చారు. గత రెండు నెలల్లోనే వీరిని ఇలా మెక్సికో సరిహద్దుల్లో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు.
అమెరికా భారత్ కు తొలి బ్యాచ్ లో పంపిన 104 మందిలో పంజాబ్ కు చెందిన వారు 30 మంది, గుజరాత్ కు చెందిన వారు మరో 33 మంది ఉన్నారు. వీరిలో సగానికి సగం మంది ఇలా మెక్సికో సరిహద్దుల ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడిన వారే. అలాగే వీరిలో చాలా మంది ఏజెంట్లెకు ఇలా డుంకీ మార్గంలో (అక్రమంగా నదులు, సరిహద్దులు దాటుతూ) తమను అమెరికాకు చేర్చినందుకు 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ చెల్లించినట్లు కూడా తేలింది. వీరంతా ఇప్పుడు భారత్ చేరుకున్నాక క్రమంగా తమ అక్రమ వలసకు సంబంధించిన వివరాలు బయటపెడుతున్నారు. దీంతో ట్రంప్ వీరిని తరిమేయడం సమంజసమే అన్నట్లు నిరూపిస్తున్నారు.