భూగర్భంలో ఇరాన్ ఏర్పాటు చేసిన అణు స్థావరాలపై దాడులు చేయగల సత్తా ఉన్నవాటిలో ఒకటిగా చెబుతున్న ఆయుధాన్ని ఇప్పటి వరకు ఉపయోగించలేదు. అయితే, ఆ ఆయుధం ఇజ్రాయెల్ దగ్గర లేదు. అది GBU-57A/B- MOP(మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్). ప్రపంచంలో బంకర్లను బద్దలు కొట్టే అతి పెద్ద బాంబు. ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉందని చెబుతున్నారు. 13,600 కేజీలు బరువు ఉండే ఈ ఆయుధం, టార్గెట్లపై కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఇరాన్ పర్వత ప్రాంతాల్లోని భూగర్భంలో బాగా లోతులో ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రంలోకి ఇది చొచ్చుకుపోగలదు. ఆమెరికా ఇప్పటి వరకు ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్కు ఇవ్వలేదు.
అసలేంటీ ఆయుధం?
‘‘GBU-57A/B చాలా లోతుల్లోకి చొచ్చుకు వెళ్లగల ఆయుధం. భూగర్భంలో బాగా లోతులో నిర్మించిన సైనిక స్థావరాలు, సొరంగాల్లో దాచిపెట్టిన వాటిని ధ్వంసం చేసే సత్తా దీనికి ఉంది’’ అని అమెరికా(America) ప్రభుత్వం చెబుతోంది. ఆరు మీటర్ల పొడవు ఉండే ఈ ఆయుధం పేలడానికి ముందు భూ ఉపరితలం నుంచి 200 అడుగుల లోతుకు చొచ్చుకుపోతుంది. ఒకేసారి వరుసగా అనేక బాంబుల్ని ప్రయోగిస్తే, అవి భూమిలోపలకు వెళ్లి పేలిన ప్రతీసారి చాలా లోతుకు డ్రిల్లింగ్ చేస్తాయి. ఈ బాంబును బోయింగ్ సంస్థ తయారు చేసింది. ‘మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్’ ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ ఉపయోగించలేదు. అయితే న్యూ మెక్సికో(New Mexco)లోని అమెరికన్ మిలటరీ టెస్టింగ్ ఏరియాలో ఉన్న వైట్ శాండ్స్ మిసైల్ రేంజ్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. “మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్”(Mother of all bombs) అని పిలిచే 9800 కేజీల బరువుండే మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ (ఎంఓఏబీ) కంటే మాసివ్ ఆర్టినెన్స్ పెనిట్రేటర్ (ఎంఓపీ) చాలా శక్తిమంతమైనది. మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబును 2017లో అఫ్గానిస్తాన్(Afghanistan) యుద్ధంలో ఉపయోగించారు.
“మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ సైజుకు సమానమైన ఆయుధాలు తయారు చేసేందుకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ గట్టిగా కృషి చేసింది. అయితే పేలుడు పదార్ధాన్ని పటిష్టమైన లోహపు అరలో ఉంచడంతో GBU-57A/B మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ ఏర్పడింది” అని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్లో పీస్ స్టడీస్ ప్రొఫెసర్ పాల్ రోజర్స్ చెప్పారు.
ప్రస్తుతం ఎంఓపీని ది స్టెల్త్ బాంబర్గా గుర్తింపు పొందిన అమెరికన్ బి 2 స్పిరిట్ అనే యుద్ధ విమానానికి అమర్చి ప్రయోగించేందుకు ఉపయోగిస్తున్నారు. బి-2 యుద్ధ విమానాన్ని నార్త్రోప్ గ్రుమ్మన్ సంస్థ తయారు చేసింది. అమెరికన్ వైమానిక దళ ఆయుధాగారంలో ఇది అత్యాధునిక యుద్ధ విమానం. ఈ విమానం 18 వేల కేజీల పేలుడు పదార్ధాలను మోసుకు వెళ్లగలదని దీన్ని తయారు చేసిన సంస్థ చెబుతోంది. అయితే 27,200 కేజీలు ఉండే రెండు జీబీయూ-57ఏ/బి బంకర్ బస్టర్ బాంబులను మోసుకెళ్లే బి-2 విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించింది. ఈ విమానంలో ఒకసారి ఇంధనం నింపితే 11వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
ఇరాన్ మాదిరిగా ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్న దేశాలపై ఎంఓపీలను ఉపయోగించేట్లయితే బి-2 బాంబర్లతో పాటు ఇతర యుద్ధ విమానాలను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ఎఫ్- 22 స్టెల్త్ విమానాలతో దాడులు చేయవచ్చు. ఈ దాడి విజయవంతమైందా లేదా, మరోసారి దాడి చేయాలా అనే దాన్ని విశ్లేషించేందుకు డ్రోన్లను ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ రోజర్స్ చెప్పారు.
అమెరికా దగ్గర పరిమిత సంఖ్యలోనే ఎంఓపీ బాంబులు ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.
“ఈ తరహా బాంబులు అమెరికా దగ్గర బహుశా 10 లేదా 20 ఉండవచ్చు” అని ఆయన చెప్పారు.
ఇరాన్ మీద ఎంఓపీ బాంబును ప్రయోగిస్తారా?
ఇరాన్లోని యురేనియం శుద్ధి కేంద్రాల్లో నతాంజ్ ప్రధానమైనది. ఆ తర్వాతి స్థానంలో ఫోర్డో ఉంది.
ఈ స్థావరాన్ని తెహ్రాన్కు నైరుతి వైపున 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోమ్ నగరం వద్ద ఉన్న పర్వతాల్లో నిర్మించారు. ఫోర్డో అణు స్థావరాన్ని 2006లో నిర్మించడం ప్రారంభించారు.
2009లో ఇది పని చేయడం ప్రారంభించింది. అదే ఏడాది దీని ఉనికిని తెహ్రాన్ నాయకత్వం బహిరంగంగా అంగీకరించింది. పర్వత ప్రాంతంలో రాళ్లు, మట్టి కింద 260 అడుగుల లోతున ఉన్న ఫోర్డో అణు స్థావరానికి ఇరాన్, రష్యా ఉపరితల, గగనతల మిసైల్ వ్యవస్థల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని 2023 మార్చ్లో సందర్శించిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సభ్యులు ఇక్కడ అణ్వస్త్రాలు తయారు చేసేందుకు అనువుగా ఉన్న 83.7శాతం శుద్ధి చేసిన యురేనియం మూలకాలను గుర్తించారు.
అమెరికా వైఖరి ఏంటి?
అమెరికా ఈ బాంబు ప్రయోగిస్తుందా లేదా అనేది, అది ఈ యుద్ధంలో పాల్గొనాలనే సుముఖత మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా ట్రంప్ నాయకత్వంలో. “ఇది ట్రంప్ ఇజ్రాయెల్కు సాయం చేసే విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది” అని రోజర్స్ అన్నారు. కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో వాషింగ్టన్ తన సైన్యాన్ని ఎందుకు రంగంలోకి దించడం లేదని ట్రంప్ను అడిగారు. “నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు” అని అన్నారు. ఫోర్డోపై అమెరికా దాడి చేసేందుకు ఎంత వరకు అవకాశం ఉంది అని అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి లెయిటర్ను ఇటీవల ఏబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు, రక్షణపరంగా సాయం అవసరమైతే తాము అమెరికాను మాత్రమే సాయం కోరతామని ఆయన చెప్పారు.
భారీ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ లాంటి ఆయుధం అవసరం
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ తాజా దాడుల తర్వాత “భూగర్భంలో చాలా లోతులో ఉన్న ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ విజయం సాధించిందా” అంటే కష్టమేనని ప్రొఫెసర్ రోజర్స్ అన్నారు. “వాళ్లు స్వయంగా చేయలేని ఆ పనికి భారీ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ లాంటి ఆయుధం అవసరం” అని ఆయన చెప్పారు.
Read Also: Iran: ఆసిమ్ మునీర్తో ట్రంప్ భేటీపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు