జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. అలాగే- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్లో ఈ భేటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఇందులో పాల్గొన్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం
వారితో పాటు త్రివిధ దళాధిపతులు ఈ భేటీకి హాజరు కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పహాల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగబోతోందంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం చర్చనీయాంశమౌతోంది. త్రివిధ దళాధిపతులు ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ), అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి (నేవీ), అమర్ ప్రీత్ సింగ్ (వైమానిక దళం)తో ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు. యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం ఆరా తీశారు. వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. యుద్ధంపై ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఈ భేటీ పట్ల పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రదాని మోదీ త్రివిధ దళాధిపతులతో భేటీ కావడాన్ని నిశితంగా పరిశీలించింది. భారత్ తమపై యుద్ధానికి దిగడం ఖాయమని తీర్మానించుకుంది. భారత్ యుద్ధ సన్నాహకాలు చేపట్టిందని, ఏ క్షణమైనా సైనిక చర్యకు దిగొచ్చనే తుదినిర్ణయానికి వచ్చింది.
సంచలన ప్రకటన
దీనిపై పాకిస్తాన్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఓ సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. వచ్చే 24-36 గంటల వ్యవధిలో ఏ క్షణమైనా భారత్ తమపై యుద్ధానికి దిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ మేరకు అత్యంత విశ్వసనీయ సమాచారం తమకు అందిందని తెలిపారు. పహల్గామ్లో 26 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనను అడ్డుగా పెట్టుకుని భారత్ తమపై యుద్ధానికి దిగుతోందని, నిజానికి ఆ ఉగ్రవాద దాడితో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని అతావుల్లా తెలిపారు. ఈ విషయంలో భారత్ చేస్తోన్న ప్రకటలన్నీ కూడా నిరాధారమైనవని అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాదంపై దర్యాప్తుకు తాము సిద్ధం
దశాబ్దాలుగా ఉగ్రవాదానికి తాము స్వయంగా బలి అవుతున్నామని, ఆ దాడులు మిగిల్చే క్షోభ ఎలాంటిదో తమకు బాగా తెలుసునని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామెందుకు పెంచి పోషిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము దాన్ని ఖండిస్తూ వచ్చామని అతావుల్లా గుర్తు చేశారు. ఉగ్రవాదం విషయంలో భారత్.. తన విచారణ తానే జరుపుకొంటూ, తీర్పు ఇచ్చుకుంటూ, శిక్షను సైతం విధిస్తోందని అతావుల్లా వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రవాదంపై విశ్వసనీయత, పారదర్శకంగా తటస్థ/ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించినప్పటికీ భారత్ దాన్ని పట్టించుకోవట్లేదని విమర్శించారు.
Read Also: Earthquake : న్యూజిలాండ్ లో భారీ భూకంపం