గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్నిమిగిల్చింది.సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోగి ఎగిరిన కాసేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel)పై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఒక్క వ్యక్తి మినహా పైలట్లు, సిబ్బంది సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్న పలువురు మృతిచెందారు. అయితే మృతుల చివరి ప్రయాణ గాథలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అలాంటి కథే అమ్రేలీ జిల్లాకు చెందిన అర్జున్భాయ్ మనుభాయ్ పటోలియాది.
స్వగ్రామానికి
అర్జున్భాయ్ మనుభాయ్ పటోలియా లండన్లో అతడి భార్య, ఇద్దరు పిల్లలతో గత కొన్నేళ్లుగా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. ఇంతలో విధి కన్నుకుట్టిందేమో ఇటీవల అర్జున్(Arjunbhai Manubhai Patoliya) భార్య లండన్లో చనిపోయారు. భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలను నిమజ్జనం చేయడానికి స్వగ్రామానికి వచ్చారు అర్జున్భాయ్ మనుభాయ్. ఇద్దరు పిల్లలను లండన్లోనే వదిలి వచ్చారు. బంధువుల సమక్షంలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని లండన్కు తిరిగి పయనమయ్యారు. గురువారం (జూన్ 12) జరిగిన ఎయిర్ ఇండియా- ఏఐ 171 బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానంలో ప్రమాదంలో అర్జున్ మరణించారు.
పిల్లల భవిష్యత్తు
ఎయిర్ ఇండియా క్రాష్లో మృతిచెందిన అర్జున్భాయ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గతంలో చనిపోయారు. తల్లి సూరత్(Surat)లో ఉంటున్నారు. లండన్లో ఉన్న ఇద్దరు పిల్లలకు ఈ వార్త తెలియడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పిల్లలు ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయి అనాథలయ్యారు.లండన్లో ఉన్న అర్జున్భాయ్ పిల్లల భవిష్యత్తు గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి సంరక్షణ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే దానిపై చర్చిస్తున్నామని అర్జున్ బంధువు ఒకరు తెలిపారు.
Read Also: Iraq: ఇరాక్ నుంచి అమెరికా రాయబార సిబ్బంది తరలింపు