యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజా(Gaza)లో మానవతా సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. రాబోయే 48 గంటల్లోపు తక్షణమే మరిన్ని సహాయక చర్యలు చేపట్టకపోతే, దాదాపు 14,000 మంది పసికందులు మరణించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి(United Nations Organisation) (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్(Israel) అధికారులు 11 వారాల సంపూర్ణ దిగ్బంధనం తర్వాత, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ (America, Canada, UK0 వంటి మిత్రదేశాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పాలస్తీనా భూభాగంలోకి పరిమితంగానే సహాయ సామగ్రిని అనుమతిస్తున్నారు.
అవసరమైన వారికి ఆహారం లేదు
ఐరాస మానవతా వ్యవహారాల చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ, సోమవారం నాడు కేవలం ఐదు ట్రక్కుల మానవతా సహాయం మాత్రమే గాజాలోకి ప్రవేశించిందని, ఇందులో శిశువులకు అవసరమైన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇన్ని వారాల ఇజ్రాయెల్ దిగ్బంధనం తర్వాత ఇది “సముద్రంలో కాకి రెట్ట వంటిది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొద్దిపాటి సహాయం కూడా ఇంకా అవసరమైన వారికి చేరలేదని ఆయన పేర్కొన్నారు. “మనం వారిని చేరుకోలేకపోతే రాబోయే 48 గంటల్లో 14,000 మంది పసికందులు ప్రాణాలు కోల్పోతారు… పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులకు, తమ పిల్లలకు పాలు పట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి శిశువుల ఆహారాన్ని చేరవేయడానికి మేం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం” అని ఫ్లెచర్ తెలిపారు.
గాజాలో ఇజ్రాయెల్ దాడులపై దేశాధినేతల ఖండన
గాజాలో ఇజ్రాయెల్ దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాధినేతలు సోమవారం తీవ్రంగా ఖండించారు. మానవతా సహాయంపై ఆంక్షలు ఎత్తివేయకపోతే సంయుక్త చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ఇజ్రాయెల్ సహాయాన్ని అడ్డుకోవడం, నెతన్యాహు ప్రభుత్వంలోని మంత్రులు పాలస్తీనియన్లను సామూహికంగా నిర్వాసితులను చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇజ్రాయెల్ మిత్రదేశాల ఈ చర్యను “గట్టి మాటలు” అని అభివర్ణించిన ఫ్లెచర్, అంతర్జాతీయ సమాజం తన వైఖరిని కఠినతరం చేయడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈరోజు మరో 100 ట్రక్కుల నిండా శిశువుల ఆహారం, పోషకాహార పదార్థాలను గాజాకు చేరవేయాలని ఐరాస ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
Read Also: America: అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు – తీవ్ర ప్రభావం