ఉక్రెయిన్-రష్యా దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీనితో ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలో చమురు ధరలు పెంచే అవకాశాలున్నాయి.
అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా విషయంలో భారత్ ఎంత తటస్థ వైఖరి అవలంబిస్తున్నా అంతర్జాతీయంగా వారిద్దరి మధ్య సాగే పోరు ప్రభావం మాత్రం మనపై పడుతూనే ఉంది. తాజాగా రష్యా చమురు ఉత్పత్తిదారులు, నౌకలపై అమెరికా విధించిన భారీ ఆంక్షలు భారత్ తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి.
ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభించి ఏడాది దాటిపోయినా ఫలితం రాబట్టుకోలేకపోవడం రష్యాకు శాపంగా మారింది. ముఖ్యంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న అమెరికా, నాటో దేశాల్ని ఎదిరించి ఈ యుద్ధం గెలవడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే భారత్ మాత్రం ఇవేవీ లెక్కచేయకుండా మిత్రదేశమైన రష్యా వద్ద రాయితీతో మరీ చమురు కొంటోంది. చైనా పరిస్ధితి కూడా ఇదే. దీంతో అమెరికా ఈసారి గట్టిగా కొరడా ఝళిపించింది.

రష్యా చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పుడు భారత్, చైనా వారి నుంచి చమురు కొనే పరిస్ధితి లేకుండా పోతోంది. దీంతో ఈ రెండు దేశాలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికాల నుండి మరింత చమురును కొనాల్సిన పరిస్ధితి. ఈ పరిణామం సహజంగానే చమురు ధరలు, సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయి. దీంతో భారత్, చైనా అంతర్గతంగా చమురు ధరల పెంపుకు సిద్ధం కావాల్సిందే.
పాశ్చాత్య ఆంక్షలు, 2022లో గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ విధించిన ధరల పరిమితి వల్ల భారత్, చైనాకు చమురు రవాణా చేయడానికి అనేక ట్యాంకర్లు వాడుకున్నారు. అలాగే రష్యా చమురు వాణిజ్యాన్ని యూరప్ నుండి ఆసియాకు మార్చింది. కొన్ని ట్యాంకర్లు ఇరాన్ నుండి చమురును కూడా రవాణా చేశాయి. ఇప్పుడు ఇవన్నీ ఆంక్షల పరిధిలోకి వచ్చేశాయి.