ఇటీవల కాలంలో భారత, కెనడాదేశాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్నది. ప్రధాని ట్రూడో నిత్యం ఇండియాపై ఏదోఒక విధంగా విమర్శలు చేస్తూ చివరికి స్క్ పదవికి ఎసరు తెచ్చుకున్నారు. ఈ దశలో హఠాత్తుగా కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.మార్చి 9న ట్రూడో స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నట్లు ప్రకటించింది. ‘లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా మార్చి 9న కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది. 2025 ఎన్నికల్లో పోరాడి గెలిచేందుకు సిద్ధంగా ఉంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు సచిత్ మెహ్రా ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కొత్త నాయకుడే ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కెనడా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని జస్టిన్ ట్రూడో ప్రకటించడంతో కొత్త ప్రధాని ఎన్నికకై అధికార లిబరల్ పార్టీలో కసరత్తు జరుగుతున్నది. ప్రధాని రేసులో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధాన పోటీదారుగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ (57) ఉన్నారు. ప్రస్తుతం ఆమె కెనడా రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనిత తల్లిదండ్రులు భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. కెనడాలోని నోవా స్కోటియాలో జన్మించిన అనిత పొలిటికల్ స్టడీస్, న్యాయవిద్యను పూర్తి చేసి టొరంటో యూనివర్సిటీలో విద్యా బోధన చేశారు.
ప్రధాని పదవికి ఆమె పేరును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఆమెతోపాటు భారతీయ మూలాలు కలిగిన ఎంపీలు జార్జ్ చాహల్, చంద్ర ఆర్యతోపాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, ఆర్థికవేత్త మార్క్ కార్నే, సైతం ఈ పదవికి పోటీ పడుతున్నారు