గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించడానికి కొన్ని గంటల ముందు మారణ హోమాన్ని సృష్టించిందక్కడ. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది. ఈ ఘటనలో 115 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, 28 మంది పిల్లలు ఉన్నారు. 265 మంది గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధికార ప్రతినిధి మహ్మద్ బసుల్ తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

నిజానికి- హమాస్తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్. దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది షరతు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించడానికి కొన్ని గంటల ముందు ఈ గగనతల దాడులు సాగాయి. గాజా ఉత్తరప్రాంతంలోని షేక్ రంద్వాన్పై ప్రధానంగా ఈ డ్రోన్ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 115 మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారని మహ్మద్ బసుల్ చెప్పారు. గాజా చరిత్రలో డెడ్లియెస్ట్గా అభివర్ణించారు. గాయపడ్డ వారిని అల్- అరబ్ అహ్లి, బాప్టిస్ట్ ఆసుపత్రులకు తరలించారు.