మయన్మార్ , థాయ్లాండ్ దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో రెండు దేశాలు వణికిపోయాయి. రోడ్లు, వంతెనలు, ఎయిర్పోర్ట్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, థాయ్లాండ్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి.

మయన్మార్కు భారత్ దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రి
ఈ విపత్తులో పూర్తిగా దెబ్బతిన్న మయన్మార్కు భారత్ దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని సైనిక రవాణా విమానంలో పంపింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద భారత వైమానిక దళానికి చెందిన C130J విమానం సహాయ సామగ్రితో హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి మయన్మార్కు బయల్దేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి పరికరాలు, సౌర దీపాలు, అవసరమైన మందులు పంపుతున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. భారత్తోపాటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి.
1,000 దాటిన మరణాల సంఖ్య, 2370 మంది గాయపడ్డారు
మరోవైపు ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల్లో మరణాల సంఖ్య వెయ్యి దాటింది. మయన్మార్లో కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు ఈ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో, 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బ్యాంకాక్లో 10 మంది మరణించగా.. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనావేసింది.