తెలంగాణలో వాతావరణం మళ్లీ చల్లబడుతోంది. ఉదయాన్నే ఎండలు కొంచెం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, సాయంత్రం అయితే చల్లదనం అలరిస్తోంది. వర్షం, ఉరుములు, మెరుపులతో ఆకాశం నిండిపోతుంది. దీనికి కారణం ఉత్తర దక్షిణ ద్రోణులు మరియు ఉపరితల ఆవర్తనాలే అని చెబుతోంది Telangana వాతావరణ కేంద్రం.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వర్షాలు ఇప్పుడే అగేలా కనిపించడం లేదు. వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందట. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది.వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

క్యుములోనింబస్ మేఘాల ప్రభావం ఏమిటంటే…
ఈ వర్షాల వెనక క్యుములోనింబస్ మేఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇవి ఉన్నపుడు ఉదయాన్నే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుంటాయి. కానీ సాయంత్రం అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఉరుములు, మెరుపులతో పాటు వర్షం కురుస్తోంది.ఇక నైరుతి రుతుపవనాలు కూడా దూసుకెళ్తున్నాయి. ఇవి ఇప్పుడు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం వరకు విస్తరించాయి. ఈ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది.
హైదరాబాద్ వాసులకు అలెర్ట్
హైదరాబాద్ నగరంలోనూ రానున్న రోజులలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. మోస్తరు వర్షాలు పడొచ్చని అధికారులు సూచిస్తున్నారు. రహదారుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కూడా అప్రమత్తం చేశారు.ఈ వర్షాల వల్ల రైతులకు మాత్రం కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. భూమి తడిగా మారుతుండటం వల్ల ఖరీఫ్ సాగుకు బేస్ ఏర్పడుతోంది. అయితే గాలివానలు, పిడుగుల ప్రభావం వల్ల పంట నష్టాలు తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
Read Also : Anil Kumble : రోహిత్ శర్మ, విరాట్ లకు ఘనమైన వీడ్కోలు పలికితే బాగుండేది: అనిల్ కుంబ్లే