ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో గుండెపోటు కారణంగా యువత మరణాలు పెరిగిపోతుండటం స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది. ఆరోగ్య పరిరక్షణ పట్ల విస్మృతిలో ఉన్న ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడులు, ఆహార అలవాట్లు, వ్యాయామాభావం వంటి అంశాలు ఈ ప్రమాదకర పరిస్థితికి కారణంగా ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తీవ్రంగా స్పందించారు. యువతలో ఇలాంటి గుండె సంబంధిత వ్యాధులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సమస్యకు మూలకారణాలు గమనించి నివారణ చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కమిటీ (Special Committee) ని నియమించారు. ఈ కమిటీ వివిధ వైద్య నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులతో కూడి ఉంటుంది. గుండెపోటుకు గురైన యువత ఆరోగ్య చరిత్ర, జీవనశైలి, పని ఒత్తిడులు, ఆహారపు అలవాట్లు, మానసిక పరిస్థితులు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు.
ఆదేశాలు జారీ చేశామని సీఎం సిద్ధరామయ్య
గత నెలలో అనగా జూన్లో ఒక్క హసన్ జిల్లాలోనే ఇరవై మందికి పైగా గుండెపోటు కారణంగా మరణించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం నాడు కూడా 27 ఏళ్ల సంజయ్ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు.ఈ గుండెపోటు మరణాలకు గల కారణాలు, ఇందుకు పరిష్కారం చూపాలంటూ సీఎం సిద్ధ రామయ్య (CM Siddha Ramaiah) జయదేవ హృద్రోగ ఆసుపత్రుల డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ను ఆదేశించారు. ఆయన నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీని గురించి ఎక్స్ వేదికగా సిద్ధ రామయ్య పోస్ట్ చేశారు. యువకుల్లో ఆకస్మిక మరణాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేశామని సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిని పరీక్షించి, సమస్యలను విశ్లేషించాలని కమిటీకి సూచించారు.
ఆరోగ్య వంటి పథకాలను అమలు
కొవిడ్ టీకాల ప్రభావం, గుండె సంబంధిత సమస్యలపై అధ్యయనం కొనసాగుతోందని సీఎం వెల్లడించారు. హసన్ జిల్లా (Hasan District) తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక మరణాల వెనుక గల కారణాలను గుర్తించి వాటిని నివారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం హృదయ జ్యోతి, గృహ ఆరోగ్య వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు.చిన్నారులు, యువత, అమాయక ప్రజల జీవితాలు తమకు చాలా ముఖ్యమని సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హసన్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఆకస్మిక మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వాటిని నివారించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
Read Also: Karnataka: ఆటో ఛార్జీలను పెంచిన కర్ణాటక ప్రభుత్వం?