ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు పెరిగిపోతున్నాయి. చమురు ధరలు పెరగడం, సరఫరా అస్తవ్యస్తం కావచ్చన్న ఊహాగానాలు దేశీయంగా కూడా వినిపిస్తున్న వేళ, భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. భారతీయ వినియోగదారులకు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) ఆదివారం స్పష్టం చేశారు.ఇటీవల ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు, ఇజ్రాయెల్తో పెరుగుతున్న శత్రుత్వ వాతావరణం, మిడిలీస్ట్లో నెలకొన్న అస్థిరత వంటి అంశాలు చమురు ఉత్పత్తి , సరఫరాపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పరిస్థితులను కేంద్రం గమనిస్తూనే ముందుగానే చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
సరిపడా నిల్వలు
గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వైవిధ్యభరితం చేశాము. ప్రస్తుతం మనకు వచ్చే సరఫరాల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదు” అని మంత్రి తెలిపారు.దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వద్ద అనేక వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయని ఆయన వివరించారు. మన పౌరులకు ఇంధన సరఫరాల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
పెట్రోలియం నిల్వల
భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే, దిగుమతి బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి హానికరం. విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడుతుంది. అయినప్పటికీ, రష్యా (Russia) , అమెరికాల నుంచి దిగుమతులను పెంచుకోవడం ద్వారా భారత్ తన చమురు వనరులను వైవిధ్యభరితం చేసుకుంది.అత్యవసర సమయాల్లో దేశం ఆధారపడగలిగే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల కోసం నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో మంత్రిత్వ శాఖ చొరవను కూడా మంత్రి ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి సమయాల్లో ఇవి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.

మెట్రిక్ టన్నులు
అంతర్జాతీయ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు జాతీయ చమురు కంపెనీలకు భారాన్ని తగ్గించడానికి కూడా ఈ నిల్వలను ఉపయోగించుకోవచ్చు. పుదూర్లో నిల్వ సామర్థ్యం 2.25 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ) కాగా, విశాఖపట్నం (Visakhapatnam) సదుపాయం 1.33 ఎంఎంటీ ముడి చమురును నిల్వ చేయగలదని, మంగళూరులో 1.5 ఎంఎంటీ నిల్వ సామర్థ్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇవే కాకుండా తీరప్రాంతంలోనే ఉన్న చండీఖోల్లో మరో వ్యూహాత్మక నిల్వ సదుపాయాన్ని నిర్మిస్తున్నారు.
చమురు సరఫరాలో
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) అనేది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాలలో ఒకటి. ఇది ఇరాన్, ఒమాన్ మధ్య ఉన్న ఒక సంకుచిత సముద్రపలుకు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలో దాదాపు 20% ఇక్కడి నుంచే వెళుతుంది. ఇదే ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తలెత్తినట్లయితే, సరఫరాకు పెద్ద ప్రమాదమే ఉంటుంది. అయితే భారత్ ఇప్పుడిక హార్ముజ్ మీద పూర్తిగా ఆధారపడటం లేదని మంత్రి తెలిపారు.
Read Also: LIC:ఎల్ఐసీ రిక్రూట్మెంట్ 2025 .. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు