ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఇంగ్లండ్తో లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై క్రికెట్ వర్గాల్లో అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) కూడా తనదైన శైలిలో స్పందించారు.కేవలం పేలవ ఫీల్డింగ్ వల్లే భారత్ ఓడిపోయిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. భారత బౌలింగ్ దళంలో వైవిధ్యం లేకపోవడం, ఏకపక్షంగా జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడటమే పరాజయానికి ప్రధాన కారణాలని ఆయన విశ్లేషించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు రాసిన తన కాలమ్లో ఆయన ఈ అభిప్రాయాలను వెల్లడించారు.
బ్యాటర్ను తిరిగి తమ వ్యూహాన్ని మార్చుకునేలా
రెండో టెస్టులో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోవడం అత్యవసరమని చాపెల్ గట్టిగా సూచించారు. “షేన్ వార్న్ తర్వాత బహుశా అత్యుత్తమ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్” అని అభివర్ణించిన ఆయన, కుల్దీప్ను చేర్చడం ద్వారా భారత బౌలింగ్ యూనిట్లో వైవిధ్యం పెరుగుతుందని అన్నారు. “బౌలింగ్ మార్పు జరిగినప్పుడు వికెట్లు ఎందుకు పడతాయంటే దానికి ఓ కారణం ఉంది. అది బ్యాటర్ను తిరిగి తమ వ్యూహాన్ని మార్చుకునేలా చేస్తుంది. ప్రస్తుత భారత బౌలింగ్ దళంతో కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) కు ఆ వెసులుబాటు లేదు” అని చాపెల్ వివరించారు.అదేవిధంగా, ఎడమచేతి వాటం పేసర్ అర్ష్దీప్ సింగ్ను జట్టులోకి తీసుకోవాలని చాపెల్ సూచించారు. ముఖ్యంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చినా లేదా అతనికి మద్దతుగానైనా అర్ష్దీప్ను ఆడించడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్కు కొత్త కోణంలో సవాల్ విసిరినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సహాయక స్పిన్నర్
తొలి టెస్టులో ఏకైక స్పిన్నర్గా రవీంద్ర జడేజా బరిలోకి దిగాడు. అయితే, ఇంగ్లాండ్ పరిస్థితుల్లో జడేజా ప్రధాన స్పిన్నర్గా రాణించలేడని చాపెల్ అభిప్రాయపడ్డారు. “ఇంగ్లండ్ పిచ్లపై జడేజా ఫ్రంట్లైన్ స్పిన్నర్ కాదు. అతని బ్యాటింగ్ జట్టుకు అవసరం అనుకుంటే సహాయక స్పిన్నర్గా కొనసాగించవచ్చు. లేదంటే అతని స్థానంపై పునరాలోచించాల్సిందే” అని చాపెల్ పేర్కొన్నారు. కేవలం పాత పేరు ప్రఖ్యాతులపై కాకుండా, జట్టు సమతుల్యత ఆధారంగానే జడేజా (Ravindra Jadeja) ఎంపిక ఉండాలని ఆయన పరోక్షంగా సూచించారు.భారత బౌలింగ్ దళం ఒత్తిడి సృష్టించేందుకు పూర్తిగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పైనే ఆధారపడటాన్ని చాపెల్ తప్పుబట్టారు.

మిగతా బౌలర్లు మరింత క్రమశిక్షణతో
మిగిలిన పేసర్లు నిలకడగా రాణించడంలో విఫలమయ్యారని, బుమ్రా స్పెల్ను జాగ్రత్తగా ఆడితే చాలు, ఒత్తిడి తగ్గిపోతుందని ఇంగ్లాండ్ బ్యాటర్లు భావించారని ఆయన అన్నారు. “బుమ్రా జట్టులో ఉన్నప్పటికీ, మిగతా బౌలర్లు మరింత క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలి. రెండు బంతులు వరుసగా ప్రమాదకరమైన ప్రదేశంలో పడటం నేను చూడలేదు” అని ఆయన విమర్శించారు. భారత పేసర్లందరూ కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్లే కావడం, ఒకే రకమైన యాంగిల్స్తో బౌలింగ్ చేయడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లు (England batters) సులభంగా కుదురుకున్నారని ఆయన ఎత్తిచూపారు.కొత్త టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్పై కూడా చాపెల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
మెరుగైన సమతుల్యంతో
ఫీల్డ్ ప్లేస్మెంట్లు, బౌలింగ్ మార్పుల విషయంలో గిల్ వ్యూహాత్మక వైవిధ్యాన్ని, ధైర్యమైన నిర్ణయాలను వేగంగా అలవర్చుకోవాలని సూచించారు. “ఈ సిరీస్లో భారత్ పుంజుకోవాలంటే, మెరుగైన సమతుల్యంతో కూడిన జట్టు అవసరం” అని ఆయన స్పష్టం చేశారు. రెండో టెస్టు సమీపిస్తున్న తరుణంలో, ఈ ఓటమి నుంచి టీమిండియా (Team India) ఎలా పుంజుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాపెల్ చేసిన సూచనలను గిల్, జట్టు యాజమాన్యం పరిగణనలోకి తీసుకుంటాయో లేదో చూడాలి.
Read Also: IND vs ENG: షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా జైస్వాల్