ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన సత్తెనపల్లి హరీశ్కుమార్ అలియాస్ రిషికుమార్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నడుపుతున్నానని, పెట్టుబడులపై భారీ లాభాలు ఇస్తానని, తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు సరఫరా చేస్తానని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఈ మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్(Cybercrime) పోలీసులు అరెస్ట్ చేశారు.అతడి చేతిలో ఏలూరు, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన పలువురు మోసపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఏలూరు నగర శివారు వట్లూరు ఇంద్రప్రస్థా కాలనీకి చెందిన సత్తెనపల్లి హరీశ్కుమార్ అలియాస్ రిషికుమార్ కొన్నాళ్లుగా హైదరాబాద్ ప్రగతినగర్, రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నాడు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ని అని, సొంతంగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నడుపుతున్నానని ఆన్లైన్లో పలువురిని పరిచయం చేసుకున్నాడు. తనకు ట్రేడ్ బిజినెస్లో అనుభవం ఉందని, పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చేవిధంగా చేస్తానని నమ్మించాడు. ఇతడికి ఏలూరు శనివారపుపేటకు చెందిన ఓ వ్యాపారి పంది సాయికుమార్(Sai Kumar) పరిచయమయ్యారు. బంగారు బిస్కెట్లు ఇప్పిస్తానని ఆశ చూపి ఆన్లైన్లో రూ.కోటి వరకు వసూలు చేసి మోసం చేశాడు.
హరీశ్కుమార్
తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఏలూరులో పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, తెలంగాణలోని సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు హరీశ్కుమార్(Harish Kumar)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అతడి మోసాలు మరిన్ని బయటపడ్డాయి. గతంలో హరీశ్కుమార్ తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) నల్లజర్లకు చెందిన ఓ ఆక్వా వ్యాపారి వద్ద నుంచి పలు దఫాలుగా 50 లక్షల రూపాయలు తీసుకుని మోసగించాడు. బాధితుడు ఒత్తిడి చేయడంతో ఏలూరు ఇంద్రప్రస్థా కాలనీలోని ఇంటిని అతడికి అమ్మి రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ, ఇంటిని అప్పజెప్పకుండా తన కుటుంబాన్ని అందులోనే ఉంచుతూ ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెట్టాడు. అదే విధంగా ఏలూరు శనివారపుపేటకు చెందిన మరో వ్యాపారి వద్ద నుంచి సైతం రూ.2.50 కోట్లు కాజేశాడు.

మరికొందరు
అదే విధంగా బెంగళూరుకు చెందిన శశాంక్ అనే వ్యక్తికి బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మబలికి 62 లక్షల రూపాయలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు ఇటీవలే హరీశ్కుమార్ను అరెస్టు చేసి అక్కడ జైలులో ఉంచారు. హైదరాబాద్లోనూ హరీశ్కుమార్ చేతిలో 1.85 కోట్ల రూపాయలు మోసపోయిన రెనిల్కుమార్ సైతం బషీరాబాద్ సైబర్ క్రైం(Basheerabad Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ నెల 4వ తేదీన పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి బెంగళూరు నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు. తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సైతం కేసు నమోదు చేయడంతో, వాళ్లు కూడా పీటీ వారెంట్(PT warrant)పై అరెస్టుకు రంగం సిద్ధమయ్యారు. తాజాగా నిందితుడిపై ఇదే తరహాలో హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. ఏలూరులోనే మరికొందరు బాధితులు సైతం మేము కూడా మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.