1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి.. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఇది ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కు బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరకముందే మంచు శకలాన్ని ఢీకొట్టి అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. తనతో పాటు 1,500కు మందికిపైగా జల సమాధి చేసుకుంది. అయితే, దాదాపు 700మంది ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగారు.
వారిని రక్షించడంలో టైటానిక్లో ఉన్న రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకపాత్ర పోషించింది.
700 మంది ప్రాణాలు ఎలా దక్కాయంటే…
1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ సముద్రం దాటుతుండగా రాత్రి 11.40 గంటలకు టైటానిక్ ఒక మంచు కొండను ఢీకొట్టింది. ఓడకు చిల్లు పడి, నీరు లోపలికి రావడం మొదలైంది. టైటానిక్కు రూపకల్పన చేసిన థామస్ ఆండ్రూస్ కూడా ఓడలోనే ఉన్నారు. మంచు కొండ వల్ల ఓడకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఆయన.. టైటానిక్ మునిగిపోతుందని కెప్టెన్కు చెప్పారు. టైటానిక్లోని మార్కోనీ వైర్లెస్ టెలీగ్రాఫ్ యంత్రాన్ని ఉపయోగించి రాత్రి 12.15 నుంచి సాయం కోసం సందేశాలు పంపడం మొదలుపెట్టారు. 700 మంది ప్రాణాలు దక్కడానికి ఈ సందేశాలే కారణం. మోర్స్ కోడ్ రూపంలో ఈ సందేశాలు వెళ్లాయి. మోర్స్ కోడ్ చుక్కలు, గీతల రూపంలో ఉంటుంది. షార్ట్ వేవ్ రేడియో తరంగాల రూపంలో బీప్ సౌండ్లతో దీన్ని పంపిస్తారు.

టైటానిక్ మునిగిపోతోందంటూ సందేశాలు
తమ ఓడ మంచు కొండను ఢీకొట్టిందని, మునిగిపోబోతుందని కార్పాతియా అనే ఓడకు, ఫ్రాంక్ఫర్ట్ అనే జర్మనీ ఓడకు టైటానిక్ రేడియో ఆపరేటర్ జాక్ ఫిలిప్స్ సందేశం పంపారు. ”ప్రయాణికులను చిన్న పడవల్లోకి ఎక్కిస్తున్నాం. మహిళలు, చిన్నారులను వీటిలోకి పంపుతున్నాం. ఎక్కువ సేపు ఉండలేం. విద్యుత్ నిలిచిపోనుంది” అని ఓసారి.. ”టైటానిక్ నుంచి మాట్లాడుతున్నాం. ఇంజన్ రూమ్లోకి నీళ్లు వచ్చేశాయి” అని ఇంకోసారి ఇలా తమ పరిస్థితి గురించి సందేశాలు పంపారు జాక్ ఫిలిప్స్. ”యూ ఫూల్. ఆగిపోండి. దూరంగా ఉండండి” అని దూరంగా ఉన్న ఓ ఓడకు టైటానిక్ నుంచి సందేశం వెళ్లింది.

మరో పది నిమిషాల్లో అంటే.. 2.20 గంటలకి ఓడ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఆ రెండు ముక్కలూ సముద్రంలో మునిగిపోయాయి. అవి మునిగిపోయిన తర్వాత దాదాపు రెండు గంటలకు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుంది కార్పాతియా ఓడ. లైఫ్ బోట్స్ ద్వారా ఓడ నుంచి బయటపడి, ప్రాణాలతో మిగిలిన 700 మందిని ఎక్కించుకుంది. గడ్డ కట్టుకుపోయేంత చల్లగా ఉన్న అట్లాంటిక్ సాగర జలాల్లో 1,500 మందికి పైగా ఆ రాత్రి జల సమాధి అయ్యుంటారని అంచనాలు ఉన్నాయి. 1985లో టైటానిక్ శిథిలాలను గుర్తించారు. కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల లోతున మునిగిన చోటనే టైటానిక్ రెండు ముక్కలూ కనిపించాయి. చివరికి మార్కోని టెలీగ్రాఫ్ను వెలికి తీసేందుకు అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, నౌక శిథిలాలు చెదిరిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.
Read Also: Drons: అగ్రదేశాల సరసకు భారత్..డ్రోన్లు, క్షిపణులను కూల్చే ఆయుధం