బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం మార్చి 6వ తేదీన బెంగళూరులో ఘనంగా జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ను.. తేజస్వీ సూర్య పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ మహోత్సవానికి కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర తదితరులు వచ్చారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా పేరు పొందిన భాజపా పార్లమెంట్ సభ్యుడు తేజస్వీ సూర్య వివాహం నాలుగు రోజుల క్రితమే ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆదివారం రోజే ఈయన రిసెప్షన్ జరగ్గా.. ముందుగానే ఆయన బంధువులు, స్నేహితులకు ఓ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

స్నేహితులకు ఓ విన్నపం
వివాహం జరిగిన మూడ్రోజుల తర్వాత అంటే మార్చి 9వ తేదీ ఆదివారం రోజు బెంగళూరులో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు ముందే ఎంపీ తేజస్వీ సూర్య.. రిసెప్షన్కు వచ్చే బంధువులు, స్నేహితులకు ఓ విన్నపం చేశారట. తమను ఆశీర్వదించడానికి వచ్చేటప్పుడు ఓ రెండు బహుమతులు మాత్రం అస్సలే తీసుకు రావొద్దని వివరించారట. అందులో ఒకటి బొకేలు కాగా మరోటి డ్రై ఫ్రూట్స్. తమ పెళ్లికి వచ్చిన అనేక మంది అతిథులు ఈ రెండింటిని బహుమతులుగా అందజేసినట్లు వివరించారు.
వృథా ఖర్చులను నివారించడానికి..
ముఖ్యంగా పూలు, బొకేలు ఎక్కువగా రాగా.. పెళ్లి జరిగిన 24 గంటల్లోపే వాటిలో 85 శాతం పూలను పారవేయాల్సి వచ్చిందని ఎంపీ తేజస్వీ సూర్య వెల్లడించారు. ప్రతీ ఏడాది వివాహాల సమయంలో దాదాపు 3 లక్షల కిలోల డ్రై ఫ్రూట్స్ మిగిలిపోతున్నాయని.. వాటిపై దాదాపు రూ.315 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సర్వేలో తేలినట్లు చెప్పుకొచ్చారు.