శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను కొండ కిందనే ప్రయివేట్ వాహనదారులు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ దోపీడీని అరికట్టేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు.భక్తులు ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనున్నారు.భక్తుల సౌకర్యం కోసం టీటీడీ ఈవో శ్యామలరావు (EO Shyamala Rao) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం , దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆప్షన్, అత్యాధునిక స్కానర్లతో తనిఖీలు, నాణ్యమైన అన్నప్రసాదం పంపిణీ వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రైవేట్ వాహనాల ఛార్జీల దోపిడీని అరికట్టడానికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
తిరుమలపై డ్రోన్లు
తిరుమలలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంంగా ప్రయాణం అమలు చేస్తామన్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తిరుపతి-తిరుమల మధ్య తిరిగే బస్సులు తిరుమలలోని ముఖ్య ప్రాంతాలకూ వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సేవలను ఉచితంగా అందించడానికి ఆర్టీసీ అధికారులు ఓకే చెప్పారని, మొదటి దశలో దాదాపు 150 బస్సులు అందుబాటులోకి వస్తాయి అన్నారు. అలిపిరి (Alipiri) లో చెక్ పాయింట్ను అభివృద్ధి చేస్తున్నామని, జీఎంఆర్ సంస్థకు చెందిన బృందం పరిశీలన చేసిందన్నారు. అక్కడ ఆధునిక కెమెరాలు, స్కానర్లు ఏర్పాటు చేసి తనిఖీల్లో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తామన్నారు. అంతేకాదు ఇకపై తిరుమలపై డ్రోన్లు ఎగరకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నిర్వహణ కోసం
టీటీడీకి దేశవ్యాప్తంగా 61 ఆలయాలు, ఆస్తులు ఉన్నాయి. వాటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు దీనికి అనుగుణంగా అధికారులను కూడా నియమిస్తారు. టీటీడీలో పనిచేస్తున్న 21 మంది ఇతర మతాల ఉద్యోగులకు వీఆర్ఎస్(VRS) ఇచ్చే అవకాశం ఉందని, వారు అంగీకరించకపోతే కోర్టుకు నివేదిస్తామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామన్నారు. భక్తులకు భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. గతంలో కంటే ఇప్పుడు తిరుమల శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందిస్తున్నామన్నారు.
సీసీ కెమెరాలు
ఈ విషయంలో భక్తులు కూడా సంతోషంగా ఉన్నారని, ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ముడి పదార్థాలను మాత్రమే అన్నప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్లలో సౌర విద్యుత్తుతో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ ఈవో జె శ్యామలరావు. టీటీడీ (TTD) కి సంబంధించిన ఆస్తులు, వ్యవసాయ భూముల పరిరక్షణ కోసం టీటీడీ డిప్యూటీ ఈవో స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారన్నారు.
చాట్బాట్
ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థతో దళారులను అరికడతామన్నారు. అలాగే త్వరలో కియోస్క్ల ద్వారా లడ్డూలకు రసీదులు, భక్తుల సందేహాలు తీర్చడానికి చాట్బాట్ను ప్రవేశపెడతామన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ (Whats App) లో పలు సేవలు అందిస్తున్నట్లుగానే, టీటీడీకి సంబంధించి స్లాటెడ్ సర్వదర్శనం, సర్వదర్శనం, శ్రీవాణి టిక్కెట్లపై దర్శనానికి పట్టే సమయాన్ని, గదుల రీఫండ్ వివరాలను భక్తులు వాట్సప్లో తెలుసుకోవచ్చు’ అన్నారు.
Read Also: AP Village Ward Secretariat: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నూతన నిబంధన