చాలా కాలం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా జరుగుతున్నాయి. వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ప్రస్తుతం హస్తినలో ఒక్కో సీటులో గెలుపు ఇరు పార్టీలకు కీలకంగా మారిపోయింది. ఎన్ని హామీలు ఇస్తున్నా, పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఆప్, బీజేపీలకు గుబులు అలాగే ఉంది. ఈ నేపథ్యంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ అంచనాలు కీలకంగా మారిపోయాయి. వచ్చే నెల 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందన్న విషయాన్ని దాదాపు అన్ని సర్వే సంస్థలు, ఒపీనియన్ పోల్స్ నిర్ధారిస్తున్నాయి. అయితే విజేత ఎవరనే విషయంలో మాత్రం మెజార్టీ సర్వే సంస్థలు దాదాపు ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన పలు సర్వే సంస్థలు, అధ్యయన సంస్థల అంచనాలు చూస్తే ఇదే అర్థమవుతోంది. అలాగే బెట్టింగ్ బజార్లు కూడా ఇప్పుడు విజేతపై క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.

ఇప్పటి వరకు వెలువడిన పలు ఒపీనియన్ పోల్స్ అధికార ఆప్ కు ఆధిక్యం కట్టబెట్టాయి. తాజాగా రాజస్థాన్లోని ఫలోడి సత్తా బజార్ బెట్టింగ్ మార్కెట్ కూడా ఆప్ 36 సీట్లు సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది. 70 సీట్ల అసెంబ్లీలో ఆప్ కు 39-41 సీట్లు వస్తాయని, అలాగే విపక్ష బీజేపీకి మాత్రం 29 నుంచి 31 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. గతంలో ఆప్ కు 36 సీట్లు వస్తాయని అంచనా వేసిన సత్తా బజార్.. తాజాగా అంచనా సవరించింది. అదే సమయంలో ప్రముఖ సర్వేల సంస్థ సీ-ఓటర్ కూడా తమ అంచనాల్ని విడుదల చేసింది. ఇందులోనూ ఆప్ హవా కొనసాగబోతోందని తేలిపోయింది. తమ సర్వేలో 51 శాతం మంది ఆప్ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు సీ-ఓటర్ తెలిపింది.