Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్కు షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఓడించారు. 3 వేల పైచిలుకు ఓట్లతో పర్వేశ్ గెలుపొందారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా కేజ్రీవాల్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గపోవడం ఆప్ను మరింత బాధిస్తోంది. ఇప్పటి వరకు ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు అరవింద్ కేజ్రీవాల్. అయితే నాలుగోసారి కూడా గెలుస్తారని భావించారు. కానీ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్ను న్యూ ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం ఆప్ ఖాతాలోనే పడింది. కోండ్లి నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరఫున పోటీ చేసిన కుల్ దీప్ కుమార్ గెలుపొందారు. బీజీపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్పై కుల్ దీప్ 6,293 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాగా, లక్ష్మీనగర్ నియోజకవర్గంలో అభయ్ వర్మ విజయం సాధించడంతో బీజేపీ ఖాతా తెరిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, వాటర్ స్కాం, అవినీతి ఆరోపణలు ఆప్ కొంపముంచాయి అని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది.
గత అసెంబ్లీ ఎన్నికలో 70 అసెంబ్లీ సీట్లకు గాను.. ఆప్ 67 సీట్లు సాధించి బంపర్ విక్టరీ కొట్టింది. అర్వింద్ కేజ్రీవాల్పై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఆప్ను అత్యంత మెజార్టీతో ప్రజలు గెలిపించారు. కానీ అదే వ్యక్తిని ఇప్పుడు ప్రజలు ఛీకొడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఇవే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అర్వింద్ కేజ్రీవాల్ను ప్రజలు ఆదరించడానికి ముఖ్య కారణం.. ఆయనపై ఉన్న క్లీన్ ఇమేజ్. అవినీతి రహిత పాలన అందిస్తాడనే పేరు కేజ్రీవాల్ సొంతం. వీటితో పాటు విద్యా, వైద్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు దేశానికే తలమానికంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా కూడా కేజ్రీవాల్పై సానుకూల అభిప్రాయం ఉంది. ఐతే, గత ఏడాది లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. దాదాపు ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపాడు. ఢిల్లీలో తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో క్విడ్ ప్రో కో జరిగిందనే ఆరోపణలతో కేజ్రీవాల్తో పాటు, ఆప్ కీలక నేతలైన మనీష్ సిసోడియా, సంజయ్ కూడా జైలుకు వెళ్లారు. దీంతో ప్రజల్లో ఆప్ నేతలు తప్పు చేశారన్న అభిప్రాయం ఏర్పడింది.
కేజ్రీవాల్ను ప్రజల నమ్మడానికి మరో ముఖ్య కారణం.. ఆయన సింప్లిసిటీ. ఆయన ఆఫీస్కు వెళ్లినా.. రోడ్డుపై మార్నింగ్ వాక్ చేసినా.. ఎన్నికల ప్రచారంలో ఆయినా ఆయన వేషధారణ సాధారణంగా ఉంటుంది. ఆయన వాడే కారు కూడా మిగతా సీఎంల లాగా ఖరీదైనవి ఉండవు. సింపుల్గా చెప్పాలంటే.. ఆయనను చూస్తే మన పక్కింటి అంకుల్ను చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉండాటు కేజ్రీవాల్.