వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫల్పట్టి మచ్చుయా సమీపంలోని ఒక హోటెల్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ‘ సెంట్రల్ కోల్కతా బుర్రాబజారులోని మెచ్చుబజారులో ఉన్న రీతురాజ్ హోటల్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం రాత్రి 8:15 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీశాం, అలాగే చాలా మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి’ అని కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ పేర్కొన్నారు.అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని సీసీ తెలిపారు. ఘటనా స్థలిలోసహాయక, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని కమిషనర్ అన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా గుర్తించలేదని ఆయన చెప్పారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు పలువురు షేర్ చేస్తున్నారు.
తీవ్రంగా
ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి, పశ్చిమ్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే బాధితులను రక్షించి, అవసరమైన వైద్య, మానవతా సహాయాన్ని అందించాల్సిందిగా కోరారు.‘ఈ ఘటన బాధాకరం. బాధితులను తక్షణమే రక్షించి, వారికి అవసరమైన వైద్య సహాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా అగ్నిమాపక చర్యలపై మరింత కఠిన పర్యవేక్షణ ఉండాలి’ అని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.పశ్చిమ్ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ కోల్కతా కార్పొరేషన్ను తీవ్రంగా విమర్శించారు. ‘ఇది చాలా దారుణమైన ఘటన. భవనంలో ఇంకా చాలా మంది చిక్కుకుపోయారు. అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు లేవు కార్పొరేషన్ ఏం చేస్తోందో అర్థం కావడంలేదు’ అని ఆయన ఏఎన్ఐ కి తెలిపారు.
Read Also: Pakistan India War: టర్కీ సైనిక అధికారులు పాకిస్తాన్లో పర్యటన.. దేనికి సంకేతం?