కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణం ఏమిటి?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్టు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీసింది. ముఖ్యంగా కన్నడ ప్రజలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్లో అంతగా తప్పేమీ లేకపోయినా, ఆయా మాటల వెనుక దాగున్న భావన కన్నడిగులకు అసహనం కలిగించింది.
స్టాలిన్ పోస్ట్ ఏమి చెప్పింది?
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో పోస్ట్ చేశారు. అందులో, నూతన సంవత్సరాన్ని కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. హిందీ భాష బలవంతపు అమలు, నియోజక వర్గాల పునర్విభజన వంటి భాష, రాజకీయ ముప్పుల నేపథ్యంలో దక్షిణాది ప్రజలంతా ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం చాలా ఉందని ఆయన తన సందేశంలో తెలిపారు.
అంతేకాకుండా, “మన హక్కులు, మన గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలి” అంటూ తన పోస్ట్ను ముగించారు. ప్రత్యేకంగా తెలుగు, కన్నడ భాషల్లోనూ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ చేసిన ఈ పోస్ట్ ప్రజలను ఆశ్చర్యపరిచింది.
కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణం ఏమిటి?
స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా “కన్నడిగులను ద్రవిడ సోదరులు” అని సంభోదించడం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. కన్నడ ప్రజల అభిప్రాయం ప్రకారం, వారు తాము ద్రవిడులం కాదని భావిస్తారు. తమ భాష, సంస్కృతి ద్రవిడ సంప్రదాయానికి భిన్నమని చెబుతూ తమిళనాడు ముఖ్యమంత్రికి కఠినమైన కౌంటర్ ఇచ్చారు.
అంతేకాకుండా, “నియోజకవర్గాల పునర్విభజన, బలవంతపు హిందీ భాష అములపై మీతో కలిసి పోరాడేందుకు మేము సిద్ధమే. కానీ తాము ద్రవిడులు కాదని గుర్తు పెట్టుకోవాలి” అంటూ స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
విజయ్ దళపతి స్పందన
ఈ వివాదంపై ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నేత విజయ్ దళపతి కూడా స్పందించారు. “తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యుండి, కన్నడిగులను ద్రవిడులు అనడం సరికాదు” అంటూ స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అలాగే, “డీఎంకే పార్టీ ద్రవిడ మోడల్ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది” అని ఆరోపించారు. విజయ్ మాత్రమే కాకుండా, పలువురు కన్నడ రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు స్టాలిన్ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. “కన్నడిగులను ద్రవిడులుగా సంభోదించడం మాకు అంగీకారంగా లేదు” అంటూ వారు చెప్పుకొచ్చారు.
డీఎంకే పై విమర్శలు
డీఎంకే పార్టీ అనేది ద్రవిడ రాజకీయాల ఆధారంగా ఏర్పడింది. అయితే, ద్రవిడ భావజాలం అంటే కేవలం తమిళ ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదని, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని డీఎంకే నేతలు తరచూ పేర్కొంటుంటారు. కానీ కన్నడ ప్రజలు మాత్రం తమను ద్రవిడులుగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
స్టాలిన్ స్పందిస్తారా?
ప్రస్తుతం ఎంకే స్టాలిన్ ఈ వివాదంపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. కానీ, సోషల్ మీడియాలో విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఆయన ఓ క్లారిటీ ఇవ్వాల్సి రావొచ్చు. కన్నడ ప్రజల కోపాన్ని తగ్గించేందుకు స్టాలిన్ క్షమాపణ చెబుతారా? లేదా, తన వ్యాఖ్యలను సమర్థించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.