హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ 61,84,319 మంది (17.43శాతం) ఉన్నారని తెలిపారు. బీసీలు (ముస్లిం మైనారిటీలు మినహా) 46.25శాతంగా ఉన్నారని.. బీసీల జనాభా 1,64,09,179గా ఉందని పేర్కొన్నారు. ఎస్టీలు 37,05,929 మంది (10.45శాతంగా) ఉన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు 44,57,012 మంది (12.56శాతంగా) ఉన్నారని చెప్పారు. ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588 (10శాతం)గా ఉన్నారని పేర్కొన్నారు.

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కుల సర్వే నివేదికను సభలో ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర ఇంటింటి కుల సర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో నిర్ణయించామని.. కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 మంది (2.48శాతంగా) ఉన్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఓసీలు 56,01,539 (15.79శాతంగా) మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు మినహా ఓసీలు 47,21,115 మంది (13.31శాతం) ఉన్నారని రేవంత్ చెప్పారు. కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామన్నారు.
దాదాపు 50 రోజులపాటు సర్వే జరిగిందన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని చెప్పారు. పట్టణాల్లో 45.15లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 1.12కోట్ల కుటుంబాల సర్వే జరిగిందన్నారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారన్నారు. ఒక ఎన్యుమరేటర్ రోజుకు పది ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని.. ఎనిమిది పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు. 76వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు డేటా క్రోడీకరించి.. రూ.125కోట్లు ఖర్చు చేసి సమగ్ర వివరాలు సేకరించినట్లు వివరించారు. నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే సర్వే చేసినట్లు స్పష్టం చేశారు.