తెలుగు సినిమా ఖ్యాతి ‘బాహుబలి’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావడంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా మన సినిమాలు చూస్తూ ఇక్కడి దర్శకులను, నటులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పాన్ ఇండియా రేంజులో తీస్తోన్న మన సినిమాలు చైనా, జపాన్ సహా ఇతర దేశాల్లోనూ దుమ్ముదులిపేస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, దేవర వంటి సినిమాలు విదేశాల్లో కలెక్షన్లు సునామీ సృష్టించాయని గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే 70 ఏళ్లకు ముందే ఓ తెలుగు సినిమా చైనాలో ప్రభంజనం సృష్టించిందని ఎంతమందికి తెలుసు.ఎన్టీఆర్, భానుమతి నటించిన ‘మల్లీశ్వరి’ చైనాలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. దీనికి బి ఎన్ రెడ్డి దర్శకుడు, నిర్మాత. చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ప్రేమ సినిమాలో ఎన్టీ రామారావు(NT Rama Rao) నాగరాజు పాత్రలో, భానుమతి మల్లీశ్వరి పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఇది తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ ఇండస్ట్రీలోనే ఓ చక్కటి సినిమాగా చిరస్థాయిలో నిలిచిపోయింది. 1951, డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలైన ఈ సినిమా మొదటి మూడు నాలుగు రోజులు పెద్దగా ఆడలేదు, కానీ తరువాత ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి గొప్ప సినిమాగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. రెండోసారి విడుదల చేసినప్పుడు మొదటిసారికన్నా ఎక్కువ విజయం సాధించడం విశేషం.ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న ‘మల్లీశ్వరి’ చిత్రాన్ని 1952 లో పెకింగ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడా అందరికీ నచ్చడంతో ఏకంగా చైనీస్ భాషలో డబ్ చేసి మార్చి 14, 1953 లో చైనాలో విడుదల చేశారు. అలా చైనాలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా, చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి తొలి తెలుగు మూవీగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అక్కడ వచ్చిన ప్రేక్షకాదరణ చూసి ఇంగ్లీష్లోకి డబ్ చేయాలని నిర్మాతలు ఆలోచించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఎన్టీఆర్, భానుమతి, బీఎన్ రెడ్డి కెరీర్లో ‘మల్లీశ్వరి’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలై 70 ఏళ్లు దాటినా ఇందులోని పాటలు ఇంకా వీనుల విందుగా అనిపిస్తాయి.
కథ
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కథ రాయలవారి గురించి అబాలగోపాలమూ చెప్పుకుంటూ వచ్చిన కథల్లోంచి పుట్టుకొచ్చిందే మల్లీశ్వరి. రాయలవారి సామ్రాజ్యంలో వీరాపురం అనే చిన్న పద్మశాలీ గ్రామం అది. మల్లి-నాగరాజులు బావమరదళ్లు. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగారు. మల్లి తల్లిదండ్రులు కలిగినవాళ్లు. నాగరాజుది నిరుపేద కుటుంబం. బావమరదళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యారు. మల్లి తల్లికి డబ్బు పిచ్చి. సంపద తప్ప మరోటి ఆమెకు పట్టదు. పట్టించుకోదు కూడా. వరసకు బావే అయినా నాగరాజుతో మల్లి తిరగడం ఆవిడకు నచ్చదు. పైగా ఈడొచ్చిన పిల్లాయే! నాగరాజు మంచి శిల్పి. అతని ఉలి తగిలిన ఏ రాయి అయినా సౌందర్యాన్ని సంతరించుకుంటుంది.అయితే, కళ కూడు పెట్టదుగా! ఓ రోజు మల్లి నాగరాజులిద్దరూ తిరునాళ్లకెళతారు. వచ్చేటప్పుడు వర్షం కురుస్తుంది. దాంతో ఓ శిథిల సత్రంలో తలదాచుకుంటారు. సరిగ్గా అదే సమయానికి అక్కడ రాయలవారు తమ ఆస్థాన కవితో అక్కడికి వస్తారు. వచ్చినవారెవరో మల్లి, నాగరాజులకు తెలియదు. బావ కోసం మల్లి ఆడిపాడుతుంది. మల్లి నృత్యగానాలు రాయలవారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
Read Also: Single Movie: ఓటీటీలోకి సింగిల్ మూవీ ఎప్పుడంటే?