ప్రముఖ నటి సమంతా నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘శుభం’. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ఈ సినిమాకు ‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా హర్షిత్రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 09 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ట్రాలాలా బ్యానర్పై నిర్మాతగా సామ్ ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి.సమంత తన కెరీర్ తొలినాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన మొదటి రెండు చిత్రాలను ఇప్పుడు చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుందని ఆమె అన్నారు. నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు నటన గురించి పెద్దగా తెలియదని, ఆ సినిమాల్లో తాను దారుణంగా నటించాననే భావన కలుగుతుందని సమంత పేర్కొన్నారు.
కొత్తవారే
సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నా తొలి రెండు సినిమాలను ఇప్పుడు చూసుకుంటే ఇంకా బాగా నటించవచ్చు కదా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే సిగ్గుగా కూడా ఉంటుంది. కానీ ‘శుభం’ చిత్రంలో నటించిన వారందరూ కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు. వారి నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది” అని తెలిపారు.తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ మంచి కంటెంట్ను ఆదరిస్తారని సమంత అభిప్రాయపడ్డారు. “మనసును హత్తుకునే కథతో సిద్ధమైన మా ‘శుభం’ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులందరూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను” అని ఆమె ఆకాంక్షించారు.
ప్రధాన పాత్ర
నిర్మాతగా మారడంపై స్పందిస్తూ, జీవితంలో సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, నిర్మాతగా ఇది తనకు ఒక కొత్త ప్రయాణం అని సమంత వివరించారు.ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ‘శుభం’ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రలు పోషించారు. సమంతకు చెందిన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పతాకంపై ఈ చిత్రం నిర్మితమైంది. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: Mohanlal: మోహన్ లాల్కి జెర్సీ గిఫ్ట్గా ఇచ్చిన లియోనల్ మెస్సీ