ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. బాలయ్య వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలకు స్పష్టతనిచ్చారు.
జగన్ను కలిసేందుకు చిరంజీవి ఒత్తిడి చేశారా?
బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, “జగన్ ఆసక్తి చూపకపోయినా, చిరంజీవి గట్టిగా అడగడంతోనే ఆయన టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యాడు” అని వ్యాఖ్యానించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాలకృష్ణ, “అది అబద్ధం, చిరంజీవికి అవమానం జరిగింది” అని అసెంబ్లీలో పేర్కొన్నారు.
జగన్కు మేమే అపాయింట్మెంట్ కోరాం – చిరంజీవి వివరణ
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి స్పందిస్తూ, “జగన్ (Jagan) గారే మమ్మల్ని ఆహ్వానించారు. అపాయింట్మెంట్ ఇవ్వాలని మేమే ముందుగా అడిగాం” అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ ఐదుగురు మాత్రమే రావాలని సూచించారని, కానీ తాము 10 మంది వస్తామని చెప్పగా, ఆయన దానికి కూడా అంగీకరించారని గుర్తు చేశారు.
“బాలయ్య ఫోన్ అందుబాటులో లేదు” – చిరంజీవి వ్యాఖ్య
అదే సమయంలో చిరంజీవి, “ఆ భేటీకి బాలకృష్ణను కూడా ఆహ్వానించేందుకు ఫోన్ చేశాను. కానీ ఆ సమయంలో ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదు” అని అన్నారు. మిత్రుడు, సినీ సహచరుడిగా బాలయ్యను కూడా ఆ సమావేశానికి తీసుకెళ్లాలనేదే తన ఉద్దేశమని చెప్పారు.
నిజాన్ని మాత్రమే చెబుతున్నా – చిరంజీవి
తన పేరును సభలో ప్రస్తావించడంతోనే ఈ వివరణ ఇస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. “నేను ఎప్పుడూ నిస్వార్థంగా, పరిశ్రమ ప్రయోజనాల కోణంలోనే వ్యవహరిస్తాను. ఇందులో తప్పుగా భావించాల్సిన అవసరం లేదు” అని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: