స్టాక్ మార్కెట్ ఈరోజు ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, టైం గడుస్తున్నా కొద్దీ పరిస్థితి మారడం మొదలైంది. చివరికి మధ్యాహ్నం సెన్సెక్స్ 1,450 పాయింట్లకు పైగా పెరిగి, నిఫ్టీ కూడా 23,800 పాయింట్లను దాటింది. షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ ఎగిసింది. అయితే, అమెరికా సుంకాల విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం గురించి ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2:10 గంటలకు బిఎస్ఇ సెన్సెక్స్ 1,522.52 పాయింట్లు అంటే 1.98% పెరిగి 78,566.81 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 50 కూడా 416.25 పాయింట్లు పెరిగి 23,853.45 పాయింట్లకు చేరుకుంది. ఈ పెంపుతో BSEలో లిస్ట్ చేసిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.418.98 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే ఇవాళ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల వెనుక చాల కారణాలు ఉన్నాయి…
పెరిగిన బ్యాంకింగ్ స్టాక్స్
బ్యాంక్ నిఫ్టీ ఇవాళ దాదాపు 2% పెరిగి అత్యధికంగా లాభపడింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి పెద్ద ఆర్థిక స్టాక్లలో మంచి కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 19న వెలువడనున్న నాల్గవ త్రైమాసిక ఫలితాలకు ముందే ఈ స్టాక్లలో పెరుగుదల కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కలిసి సెన్సెక్స్ పెరుగుదలకు గొప్పగా దోహదపడ్డాయి.
FIIల కొనుగోళ్లు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) వరుసగా రెండవ రోజు కూడా నికర కొనుగోలుదారులుగా నిలిచారు. బుధవారం FIIలు రూ.3,936 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం ఎఫ్ఐఐ పెట్టుబడి రూ.10,000 కోట్లు దాటింది. ఇది భారత స్టాక్ మార్కెట్పై వారి గట్టి నమ్మకాన్ని సూచిస్తుంది. అమెరికా – చైనాలో ప్రస్తుత సంక్షోభం కారణంగా అవకాశాలు బలహీనంగా కనిపిస్తుండటంతో భారతదేశంలోని బయ్యర్ల వైపు ఎఫ్ఐఐలు మారారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ అన్నారు. జపాన్ -అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
అమెరికా – జపాన్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలను వ్యాపారులు అంచనా వేయడంతో ఆసియా మార్కెట్లు కూడా పెరిగాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది. జపాన్ అమెరికాతో చర్చలు ప్రారంభించడంతో జపాన్ నిక్కీ 0.7% పెరిగింది. యుకె, జపాన్, దక్షిణ కొరియాలతో పాటు భారతదేశాన్ని నాలుగు ముఖ్య మిత్రదేశాలలో ఒకటిగా అమెరికా పరిగణిస్తుందని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ విజయ్కుమార్ అన్నారు.
డాలర్ బలహీనపడటం విదేశీ పెట్టుబడులను పెంచుతుంది
డాలర్ బలహీనపడటం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ను బలపరిచింది. సాధారణంగా, డాలర్ బలహీనపడటం విదేశీ పెట్టుబడులను పెంచుతుంది అలాగే రూపాయికి మద్దతు ఇస్తుంది. ఫిబ్రవరి ప్రారంభంలో 109.88గా ఉన్న డాలర్ ఇండెక్స్ గురువారం 99.56కి పడిపోయింది. US టారిఫ్ మినహాయింపుల నుండి మద్దతు: భారతదేశంతో సహా 75 దేశాలపై జూలై 9 వరకు అదనపు సుంకాలను వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కూడా పెట్టుబడిదారుల మనోభావాలకు మద్దతు ఇస్తోంది. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఈ తాత్కాలిక రిలీఫ్ కొంత ఉపశమనం కలిగించింది. ముడి చమురు ప్రభావం: గురువారం చమురు ధరలు బ్యారెల్కు $66 వద్ద ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర $66.40 వద్ద ఉండగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) $62.90 వద్ద ఉంది. భారతదేశం చమురు అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతి ద్వారా చేసుకుంటుంది కాబట్టి, ముడి చమురు ధరలు తగ్గడం భారతదేశానికి సానుకూలంగా ఉంటుంది.
Read Also: Hemophilia :రాయల్ డిసీజ్ పై పూర్తి అవగాహన