మన స్టాక్మార్కెట్లో చట్టవ్యతిరేక విధానాల ద్వారా, అక్రమంగా రూ.వేల కోట్లు ఆర్జించిన అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూపు అనే సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI bans Jane Street) నిషేధం విధించింది. స్టాక్మార్కెట్లో ఇండెక్స్ (ఆయా రంగాల సూచీ) ధరలను ప్రభావితం చేసి, ఇన్వెస్టర్ల సొమ్మును కొల్లగొట్టటం ఈ సంస్థ చేసిన నేరం.
రూ.44,000 కోట్ల దౌర్జన్య ట్రేడింగ్..
జేన్ స్ట్రీట్ దాదాపు రూ.44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్థారించింది. అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో (Index Futures) రూ.191 కోట్లు, నగదు విభాగంలో రూ.288 కోట్లు పోగొట్టుకుంది. ఈ నష్టాలను మినహాయిస్తే, నికరంగా రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు గుర్తించారు. అందులో రూ.4,843 కోట్ల సొమ్మును జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.
సెబీ గుర్తించిన అవకతవకలు
దేశీయ స్టాక్మార్కెట్ల చరిత్రలో సెబీ ఇంత పెద్దమొత్తాన్ని పెనాల్టీ రూపంలో రాబట్టాలని నిర్ణయించటం ఇదే ప్రథమం. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ గ్రూపు సంస్థలైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ మనదేశంలోని స్టాక్మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించరాదనీ సెబీ (SEBI bans Jane Street) స్పష్టం చేసింది.

జేన్ స్ట్రీట్ గ్రూప్ గురించి
ప్రొప్రైటరీ ట్రేడింగ్ సేవల సంస్థ అయిన జేన్ స్ట్రీట్ గ్రూపు 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లో ఈ సంస్థ కార్యాలయాల్లో 2,600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మనదేశంలో ముంబయి (Mumbai) నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. స్టాక్మార్కెట్లో నగదు విభాగంతో పాటు ఫ్యూచర్స్- ఆప్షన్ల ట్రేడింగ్ కార్యకలాపాల ద్వారా.. సూచీల ధరలను కృత్రిమంగా హెచ్చుతగ్గులకు లోను చేయడం ద్వారా, అనూహ్య లాభాలు ఆర్జించే విధానాలను ఈ సంస్థ అమలు చేసింది.
ఎక్స్పైరీ రోజుల్లో తీవ్ర ఆటుపోట్లు
ప్రధానంగా లిక్విడిటీ అధికంగా ఉండే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్లపై అత్యధికంగా ట్రేడింగ్ కార్యకలాపాలు సాగించింది. ఈ సంస్థ 2023 జనవరి నుంచి 2025 మే నెల మధ్యకాలంలో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో భారీ లావాదేవీలు సాగించినట్లు, తత్ఫలితంగా ఇండెక్స్ హెచ్చుతగ్గులను ప్రభావితం చేసినట్లు సెబీ గుర్తించి, దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఈ సంస్థ అనుసరించిన రెండు వ్యూహాలను పసిగట్టారు.
అక్రమ లావాదేవీలు ఇలా
ఉదయాన్నే స్టాక్ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభం కాగానే జేన్ స్ట్రీట్ గ్రూపు తన సంస్థల ద్వారా బ్యాంక్ నిఫ్టీలో భాగంగా ఉన్న షేర్లను నగదు, ఫ్యూచర్ల విభాగంలో భారీగా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల ఆ షేర్ల ధరలు పెరిగి, ఆమేరకు బ్యాంక్ నిఫ్టీ ధర పెరుగుతుంది.

దర్యాప్తులో ఏమి బయటపడింది?
ప్యూచర్స్, ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు ట్రేడింగ్ ముగియడానికి చివరి 2-3 గంటల్లో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ షేర్లు, ఫ్యూచర్స్ను శరవేగంగా భారీగా కొనడం, అమ్మడం చేస్తుంది. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ధరలు బాగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఆ ధరలకు అనుగుణంగా ఆప్షన్లు కొనడం, అమ్మడం చేసి లాభపడుతుంది. ఈ క్రమంలో నగదు విభాగం, ఫ్యూచర్స్లో కొంత సొమ్ము కోల్పోవాల్సి వస్తుంది. దానికి ఎన్నోరెట్లు అధికంగా ఆప్షన్స్లో లాభాలు ఆర్జించే అవకాశం సంస్థకు కలుగుతుంది.
ఎఫ్పీఐ నిబంధనలు ఉల్లంఘన
మనదేశంలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరి (ఎఫ్పీఐ) తరగతి కిందకు వచ్చే ఈ సంస్థ.. నగదు, ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ చేసే క్రమంలో ఎఫ్పీఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ (SEBI bans Jane Street)గుర్తించింది. దాదాపు 21 సందర్భాల్లో లావాదేవీలు సాగించి, భారీ మొత్తాలు ఆర్జించినట్లు నిర్ధారించింది. సెబీ దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ లోపు ఆ గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి, తన ముందస్తు అనుమతి లేకుండా చెల్లింపులు చేయరాదని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 18 రోజుల బ్యాంక్ నిఫ్టీ, 3 రోజుల నిఫ్టీ ఎక్స్పైరీల్లో అవకతవకలను మాత్రమే దర్యాప్తు చేసిన సెబీ.. ఇతర ఎక్స్పైరీ రోజులు, ఇతర సూచీలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Fast food: దేవయానీ ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్ విలీనానికి