సంభాల్లో ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లికొడుకు సహా ఎనిమిది మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) పెళ్లి వేడుకకు బయలుదేరిన వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనలో పెళ్లికొడుకుతో పాటు ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హర్గోవింద్పూర్ గ్రామానికి చెందిన సుఖ్రామ్ తన కుమారుడు సూరజ్ పాల్ (20) వివాహాన్ని బదౌన్ జిల్లాలోని (Badaun district) సిర్సౌల్ గ్రామానికి చెందిన యువతితో నిశ్చయించారు. నిన్న సాయంత్రం పెళ్లి బృందంతో కలిసి దాదాపు 11 వాహనాలు బయలుదేరాయి. అయితే, వరుడు సూరజ్తో పాటు మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న మహీంద్రా బొలెరో వాహనం (Bolero vehicle) కాస్త వెనుకబడింది. ఈ క్రమంలోనే మీరట్-బదౌన్ జాతీయ రహదారిపై జునావాయి పట్టణం సమీపంలోకి రాగానే బొలెరో వాహనం అతివేగంతో అదుపుతప్పి జనతా ఇంటర్ కాలేజీ ప్రహరీని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రత – సహాయక చర్యలు
Road Accident: ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం నుజ్జునుజ్జుగా మారిపోయింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడం కష్టతరం కావడంతో, ఒక జేసీబీ సహాయంతో వాహనం భాగాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా, అప్పటికే ఎనిమిది మంది మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుల్లో పెళ్లికొడుకు సూరజ్ పాల్ (20) తో పాటు రవి (28), ఆశ (26), సచిన్ (22), మధు (20), కోమల్ (15), ఐశ్వర్య (3), గణేష్ (2) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన హిమాన్షి మరియు దేవ అనే మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు – కుటుంబాల్లో విషాదం
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వేడుకకు బయలుదేరిన వారు మార్గమధ్యంలోనే మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆనందంగా జరగాల్సిన పెళ్లి వేడుక విషాదంగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Amarnath Yatra: జమ్మూకశ్మీర్లో అదుపు తప్పిన బస్సు 36 మందికి గాయాలు