Adani shares : భారత స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు రోజుల లాభాల జోరుకు శుక్రవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల దిగ్గజ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే అదానీ గ్రూప్ (Adani shares) షేర్లలో నమోదైన భారీ ర్యాలీ మార్కెట్లను మరింత పతనం నుంచి కాపాడింది.
హిండెన్బర్గ్ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇచ్చిన క్లీన్ చిట్ అదానీ షేర్లకు బలాన్నిచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 387.73 పాయింట్లు నష్టపోయి 82,626.23 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.55 పాయింట్లు తగ్గి 25,327.05 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 82,485.92 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
మార్కెట్ మొత్తం డీలా పడినప్పటికీ అదానీ గ్రూప్ షేర్లు పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇచ్చాయి. అదానీ పవర్ షేరు 13.42 శాతం పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్ 7.55 శాతం లాభపడగా, అదానీ ఎంటర్ప్రైజెస్ 5.25 శాతం, అదానీ పోర్ట్స్ 1.15 శాతం పెరిగాయి.
మరోవైపు హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే అదానీ పోర్ట్స్తో పాటు ఎస్బీఐ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో నిలిచాయి.
రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఆటో, ఐటీ, FMCG, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు నష్టపోయాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు మాత్రం నిలకడగా ట్రేడ్ అయ్యాయి. ఇక రూపాయి విలువ డాలర్తో పోలిస్తే స్వల్పంగా బలపడి 88.10 వద్ద ముగిసింది. గత సెషన్లో ఇది 88.13 వద్ద ఉంది.
Read also :