ప్రభుత్వాలు మారినా మారని ఆడబిడ్డల తలరాత

Read Time:  1 min
dde62ef6 3e15 45d3 8056 2b201bbeab9b
dde62ef6 3e15 45d3 8056 2b201bbeab9b
FONT SIZE
GET APP

తీరని వెత…. డోలిమోత
— ప్రభుత్వాలు మారినా మారని ఆడబిడ్డల తలరాత
విశాఖపట్నం : ఈ కథ కొత్తది కాదు.. నిర్లక్ష్యపు గర్భంలో పూడుకుపోయిన పాత కథ.. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అందాల్సిన సాయం అందక కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఇది. అనాదిగా వస్తున్న ఈ దుర్భర స్థితికి అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం గాఢ నిద్రలో ఉంది. పండంటి బిడ్డకు ప్రాణం పోయాలని ఎన్నో కలలుకనే ఒక తల్లి సరియైన సమయానికి వైద్యం అందక బిడ్డను కనే లోగానే కన్ను మూస్తోంది. అయినా పాలకులకు జాలీ.. దయా లేదు. సాంకేతికంగా ప్రగతి సాధించామని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వాలు, ఏజెన్సీలోని గర్భిణుల ప్రాణాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు..?అర్థం కావడం లేదు.
విశాఖ ఏజెన్సీలో ఏటా అనేకమంది గర్భిణులు, బాలింతలు, వివిధ రోగాల బారిన పడిన వారు వైద్యo అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అడవి బిడ్డల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్న వాటిని సరి అయిన రీతిలో ఖర్చు చేయకపోవడం వలన అర్ధాయేషుతోనే చాలామంది మరణిస్తున్నారు. నవ మాసాలు నిండిన శిశువు కళ్ళు తెరవకుండానే కడుపులోని ప్రాణాలు కోల్పోతుంది.
విశాఖ ఏజెన్సీలోని అనేక మారుమూల ప్రాంతాల నుంచి వైద్య సహాయం కోసం నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రావలసి వస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ సరైన రోడ్ల సౌకర్యం లేకపోవడంతో డోలీలలో వారిని మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనేక సందర్భాలలో గర్భిణులు, రోగులు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తున్నారు.

గర్భిణుల కోసం ప్రభుత్వం పోషకాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో వీరికి ప్రభుత్వం ప్రత్యేక వసతి గృహ సౌకర్యం కూడా కల్పించింది. గర్భిణీలకు కాన్పు ఎప్పుడు వచ్చేది అన్న విషయాన్ని వైద్యులు ముందుగానే నిర్ధారించగలరు. కానీ కొంతమంది డాక్టర్లు ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదు. మరి కొంతమంది డాక్టర్లు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడక, ఆఖరి నిమిషంలో గర్భిణులను విశాఖలోని కేజీహెచ్ కు రిఫర్ చేస్తున్నారు. ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు రావాలంటే 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కొండ మీద నుంచి కిందకు దిగటానికి చాలా రోడ్లు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ కనీసం ఆటోలు, అంబులెన్సులు కానీ ప్రయాణించే పరిస్థితి లేదు. జీకే వీధి మండలంలోని ముంచింగి పుట్టు, చింతపల్లి, కొండ వంచల, పెద్దూరు, శరభన్నపాలెం, డొంకరాయి, సీలేరు, డుంబ్రిగూడ, ములగపాడు తదితర ప్రాంతాల నుంచి డోలీలలో రోగులను తరలించాల్సి వస్తోంది. గూడెం కొత్తవీధి మండలంలోని మంగంపాడు వలసగడ్డ తదితర గ్రామాలలో ఏళ్ల తరబడి రోడ్ల మరమ్మతులు జరగలేదు.

22f7b227 f0cf 4191 bee6 3ddeac2a4e1e
22f7b227 f0cf 4191 bee6 3ddeac2a4e1e

ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తున్నామని అధికారులు చెప్తున్నారు కానీ, కార్యరూపం దాల్చడం లేదు. ఏజెన్సీలలో ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి ఎందుకు సారించడం లేదు? డోలి ప్రయాణాలను నివారిస్తామని ప్రజా ప్రతినిధులు చెబుతున్న, అది వాస్తవ రూపం దాల్చడం లేదు.
ఈ విషయమై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేస్తే ఏజెన్సీలోని మారుమూల రోడ్లు బాగుపడతాయని, డోలి ప్రయాణాన్ని నివారించగలుగుతామని అన్నారు. దీని వలన ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు. అధికారుల్లో పర్యవేక్షణ, సమీక్ష లేకపోవడం దురదృష్టకరమని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణానికి మంజూరు అవుతున్న నిధులు ఎందుకు సక్రమంగా ఖర్చు కావడం లేదని ఆయన ప్రశ్నించారు.

పవన్ పర్యటనతోనైనా మార్పు వస్తుందా?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో శనివారం పర్యటించారు. పాలనలో తనదైన ముద్ర ఉండాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. అనేక అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఏజెన్సీలో డోలీల మోత అంశం ఆయన దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ఆయన చొరవ తీసుకొని మారుమూల ప్రాంతాలలోని యుద్ధ ప్రాతిపదికన నిర్మించగలిగితే అడవి బిడ్డలకు ఊపిరి పోసినవారవుతారని ఆదివాసులు ఆశతో ఉన్నారు.

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.