అమెరికాలో విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు అత్యంత కీలకమైన హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ను పూర్తిగా రద్దు చేయాలంటూ రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ‘ఎక్సైల్ యాక్ట్’ (Ending Exploitative Imported Labor Exemptions Act) తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు ప్రకారం, ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ను సవరించి హెచ్-1బి వ్యవస్థకే స్వస్తి పలకాలని ఆయన ప్రతిపాదించారు. అమెరికన్ యువత కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని స్టూబ్ వాదించారు. ముఖ్యంగా అమెరికన్ల సంక్షేమం కంటే కంపెనీల లాభాలే లక్ష్యంగా విదేశీ శ్రమను దిగుమతి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Power companies: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?
హెచ్-1బి వీసాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో దాదాపు 80 శాతానికి పైగా భారత్ మరియు చైనా పౌరులే ఉండటం గమనార్హం. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న లక్షలాది మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మరియు పరిశోధకుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. గతంలో కూడా మైక్రోసాఫ్ట్, డిస్నీ వంటి దిగ్గజ సంస్థలు స్థానిక అమెరికన్లను తొలగించి హెచ్-1బి కార్మికులను తీసుకున్నాయనే ఉదాహరణలను ఈ సందర్భంగా రిపబ్లికన్ ఎంపీలు ప్రస్తావిస్తున్నారు. అమెరికాలో నైపుణ్యం గల కార్మికుల కొరత లేదని, కేవలం తక్కువ వేతనాల కోసం విదేశీయులను ప్రోత్సహిస్తున్నారని వీరి వాదన.

ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కొత్త వీసాలపై భారీ రుసుములను ప్రతిపాదించడం, సోషల్ మీడియా తనిఖీల పేరుతో ఇంటర్వ్యూలను వాయిదా వేయడం వంటి చర్యలతో భారతీయ ఐటీ నిపుణులు ఆందోళనలో ఉన్నారు. అయితే, అమెరికాలోని టెక్ దిగ్గజాలు మాత్రం హెచ్-1బి వీసాలు లేకపోతే తమ పరిశోధనలు మరియు కృత్రిమ మేధ (AI) వంటి ప్రాజెక్టులు కుంటుపడతాయని హెచ్చరిస్తున్నాయి. ఈ బిల్లు చట్టసభల్లో నెగ్గి అధ్యక్షుడి ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com