Bomb Threats : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్కు ఈ రోజు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు సమాచారం. ఈ మెయిల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్ను బాంబులతో పేల్చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ను హత్య చేస్తామని పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్త వెలుగులోకి రాగానే కలెక్టరేట్ సిబ్బంది తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ, చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి చర్చించుకోవడం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే జిల్లా కలెక్టర్ గౌతంతో పాటు అదనపు కలెక్టర్ను కలిసి సమీక్ష నిర్వహించారు.

అత్యవసరం సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ గౌతం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో చర్చించారు. ఇక ఈ బెదిరింపు కరీంనగర్ జిల్లా నుంచి లక్ష్మణ్ రావు అనే 70 ఏళ్ల వ్యక్తి ద్వారా వచ్చిందని అధికారులు గుర్తించారు. మెయిల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం, లక్ష్మణ్ రావు గతంలో మావోయిస్టు సభ్యుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, మెయిల్ చివర్లో ముస్లిం నినాదం కూడా పొందుపరిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడి
అయితే, ఇప్పటివరకు అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులను బయటకు పంపించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనీఖీలు చేపట్టారు.